- కమీషన్ల కోసమే కొత్త సెక్రటేరియెట్ కాస్ట్ను పెంచారని ఆరోపణ
- ఇతర రాష్ట్రాల మీడియాకు రూ.80 కోట్ల యాడ్స్ ఇచ్చి
- జనం సొమ్ము వృథా చేశారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో పంట నష్టపోయి రైతులు బాధపడుతుంటే.. కొత్త సెక్రటేరియెట్ ఓపెనింగ్ పేరు చెప్పి సీఎం కేసీఆర్ హంగామా చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.20వేల చొప్పున పరిహారం ఇచ్చి, వారిని ఆదుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో మీటింగ్లకు, సెక్రటేరియెట్ ఓపెనింగ్ పేరుతో ఇతర రాష్ట్రాల మీడియాకు యాడ్స్ రూపంలో రూ.80 కోట్లు ఖర్చు చేసి, ప్రజల సొమ్మును వృథా చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తుగ్లక్ సీఎం అని ధ్వజమెత్తారు. మంచిగున్న సెక్రటేరియెట్ను కూలగొట్టి రూ.400 కోట్లతో కొత్త సెక్రటేరియెట్ నిర్మిస్తామని చెప్పి, ఇప్పుడు రూ.1,200 కోట్లు ఖర్చు చేశారని ఫైర్ అయ్యారు. కమీషన్ల కోసం ప్రాజెక్ట్ కాస్ట్ను పెంచారని ఆరోపించారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ను కూడా రూ.33వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు పెంచారని గుర్తుచేశారు. పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, కర్నాటక ఎన్నికల్లో భాగంగా ఈనెల 5న కుష్టిగిలో జరగనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీటింగ్ ఏర్పాట్లను సోమవారం వివేక్ వెంకటస్వామి స్థానిక బీజేపీ నేతలతో కలిసి పరిశీలించారు.