- కుంగిన మేడిగడ్డ బాధ్యత నాడు డబ్బా కొట్టించుకున్న నీది కాదా?
- అంత మేధావివైతే అప్పట్లో కేసీఆర్ ఎందుకు ఇరిగేషన్ నుంచి పీకేశారు
- మళ్లీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే 3 నెలల ముచ్చట
- కేటీఆర్ రేసులో ముందున్నాడనే హరీశ్కు భయం పట్టుకుందని కామెంట్
- హుస్నాబాద్లో మంత్రి పొన్నంతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హుస్నాబాద్, వెలుగు: నాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు హరీశ్రావు అప్పటి గవర్నర్ చేత తనను తాను 'కాళేశ్వరరావు' అని పిలుపించుకుని డబ్బా కొట్టించుకున్నాడని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మరిప్పుడు మేడిగడ్డ కుంగిపోతే ఆ పాపానికి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. కుంగిపోయే ప్రాజెక్టును కట్టినందుకు ప్రజలకు హరీశ్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ కలిసి రూ. కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జనగామలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్, తోటపల్లిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, హుస్నాబాద్లో టామ్కామ్ మెగా విదేశీ ఉద్యోగ మేళా, ఉమ్మాపూర్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ భవన నిర్మాణాలకు భూమి పూజలు చేశారు.
పదేండ్లలో చేయలేని పని 3 నెలల్లో చేస్తవా?
తాను ఇరిగేషన్ మంత్రి అయితే మూడు నెలల్లో శాఖ రూపురేఖలు మారుస్తా అంటూ హరీశ్రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి వివేక్ నిప్పులు చెరిగారు. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో హరీశ్రావు మూడేండ్లకు పైగా ఇరిగేషన్ శాఖను నడిపారని గుర్తుచేశారు. హరీశ్ రావు అంత మేధావి అయితే అప్పట్లో కేసీఆర్ ఆయనను ఇరిగేషన్ మంత్రి పదవి నుంచి ఎందుకు పీకేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. పదేండ్లలో చేయలేని పని ఇప్పుడు 3 నెలల్లో ఏం చేస్తావని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతి వల్ల ప్రాజెక్టులు గోదావరిలో కలిసిపోతుంటే.. తెలంగాణ ప్రజల సొమ్ముతో కాంట్రాక్టర్లంతా ప్రపంచంలోనే ధనవంతులుగా మారారని మండిపడ్డారు.
ఇప్పుడు మళ్లీ 3 నెలల్లో మార్పులు చేస్తానంటున్నది.. మిగిలిన కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికేనా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం కల్వకుంట్ల కుటుంబ అంతర్గత కుమ్ములాటలకే పరిమితమైందన్నారు. కేటీఆర్ రేసులో ముందుకు వెళ్తున్నాడనే భయంతోనే హరీశ్రావు ప్రెస్మీట్ల మీద ప్రెస్మీట్లు పెడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలో తెలియక.. ప్రభుత్వంపై బురద జల్లడమే కేటీఆర్, హరీశ్రావు లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కవిత గతంలో చెప్పినట్లుగానే వాళ్లు మీడియాను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు.
100 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు పెంచే పంచాయతీలకు మంత్రి పొన్నం రూ. 5 లక్షలు ప్రకటిస్తే.. జిల్లా ఇన్చార్జి మంత్రిగా తాను మరో రూ.5 లక్షలు నజరానా ఇస్తానని వివేక్ ప్రకటించారు. విదేశీ ఉపాధి కోసం ప్రభుత్వం రూ.90 కోట్ల బడ్జెట్ పెట్టిందని, హుస్నాబాద్లో జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్, డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయిస్తామన్నారు. జర్మన్ భాష నేర్చుకునే యువతకు నెలకు రూ. 1,000 స్టైపెండ్ ఇస్తామన్నారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ద్వారా రోబోటిక్స్, 3డీ ప్రింటింగ్, ఈవీ లాంటి కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ క్రాంతి వెస్లీ, సీపీ రష్మీ పెరుమాళ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రైతులను అన్యాయం చేయొద్దు: పొన్నం
గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 14 మంది రైతులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో వేసిన కేసుల వల్ల 70 వేల మంది రైతులకు అన్యాయం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆ రైతులు కేసులను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్జీటీ కేసులో ప్రభుత్వానికి రూ.10 కోట్ల జరిమానా విధిస్తే.. ఇప్పుడు మరింత ఫైన్ వేయించాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 220 కోట్లు కేటాయించిందని తెలిపారు. హుస్నాబాద్లో 250 పడకల ఆసుపత్రి నిర్మాణం అవుతోందని, పీజీ మెడికల్ కాలేజీ కూడా రాబోతోందని వెల్లడించారు. శాతవాహన వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
