
హైదరాబాద్, వెలుగు: పోతిరెడ్డిపాడుపై ఏపీ తీసుకొచ్చిన చీకటి జీవోను వెంటనే రద్దు చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. చేసిందంతా చేసి ఇప్పుడు సుప్రీంకు వెళ్తం, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు అంటూ సీఎం కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు. అసలీ టెండర్లకు కేంద్రం, సీడబ్ల్యూసీ అనుమతులే లేవని బుధవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. కేవలం కమీషన్ల కోసమే ఇద్దరు సీఎంలు ప్రాజెక్టుల బాట పట్టారన్నారు. తిరుపతి వెళ్లినప్పుడే కేసీఆర్ రాయలసీమకు నీళ్లిస్తామని మాటిచ్చి వచ్చారని, అందుకే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారన్నారు. జీవో బయటకు రావడం, ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తుండడంతో కేసీఆర్ ఇరకాటంలో పడ్డారని, ఆయన అసలు రంగు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోందన్నారు. కేసీఆర్ తీరు.. నా కమీషన్ నాకివ్వండి. మీ పని మీరు చేసుకోండన్నట్టు ఉందని విమర్శించారు. రెండు నుంచి మూడు టీఎంసీలకు కాళేశ్వరం కెపాసిటీని పెంచుతూ 36 వేల కోట్ల అంచనాలను లక్ష కోట్లకు తీసుకెళ్లి 8 శాతం కమీషన్లు దండుకున్నారని, ఇప్పుడు పోతిరెడ్డిపాడు విషయంలోనూ కమీషన్ల దందా నడుస్తోందన్నారు. ఈ రెండింటిలోనూ మేఘా కృష్ణారెడ్డే మీడియేటర్గా పనిచేస్తున్నారని విమర్శించారు. ఏపీ ఇచ్చిన జీవో ప్రకారం పనులు సాగితే దక్షిణ తెలంగాణ ఏడారి కావడం ఖాయమని, ప్రాజెక్టులన్నీ ఎండిపోతాయని వివేక్ అన్నారు.