మంత్రిగా తొలిసారి చెన్నూరుకు వివేక్ వెంకటస్వామి.. భారీ ర్యాలీ.. అభిమానుల ఘనస్వాగతం.. !

మంత్రిగా తొలిసారి  చెన్నూరుకు వివేక్ వెంకటస్వామి.. భారీ ర్యాలీ.. అభిమానుల ఘనస్వాగతం.. !

 కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇవాళ (జూన్ 14) మంత్రి హోదాలో చెన్నూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో అభిమానుల జయజయధ్వానాల మధ్య ఆయన చెన్నూరు బయల్దేరారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి అడుగడుగునా కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం చెప్పారు. 

ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మెదక్ వ్యాప్తంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. గజ్వేల్ లో ఘన స్వాగతం పలికారు నేతలు, కార్యకర్తలు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమ అభిమాన నాయకునికి గజమాల తో స్వాగతం పలికారు.

గజ్వేల్లో గజమాలతో సన్మానం:

గజ్వేల్ మండలం రిమ్మనగూడలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్ధిపేట డీసీసీ ప్రసిడెంట్ తూముకుంట నరసారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంక్ష రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి గజమాలతో ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత రంగదాంపల్లి చౌరస్తా అమరవీరుల స్థూపం  వద్ద నివాళులు అర్పించారు మంత్రి వివేక్. మంత్రి వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. జిల్లా మాల సంఘం నేతలు మంత్రి వివేక్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడారు. సిద్ధిపేటకు తమ తండ్రికి ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. సిద్ధిపేటలో విభేదాలను పక్కన పెట్టి సమస్యలు పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. 

కరీంనగర్ లో:

మంత్రి వివేక్ వెంకటస్వామికి కరీంనగర్ లో ఘనస్వాగతం లభించింది. అలుగునూరు, బొమ్మ కల్ చౌరస్థాలలో మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తలు, మాల సంఘాల నేతలు. టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు . 

పెద్దపల్లి జిల్లాలో:

మంత్రి యాత్ర కరీంనగర్ నుంచి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. సుల్తానాబాద్ కేంద్రంలో మాజీమంత్రి కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి వచ్చిన వివేక్ వెంకట స్వామికి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికిన స్థానిక కాంగ్రెస్ నేతలు,  అభిమానులు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన వివేక్ వెంకటస్వామి.

పెద్దపెల్లి ప్రాంతానికి మా కుటుంబం రుణపడి ఉంది: మంత్రి

మంత్రిగా తొలిసారిగా పెద్దపల్లి గడ్డపై అడుగు పెట్టడం సంతోషంగా ఉందని మంత్రి వివేక్ అన్నారు. పెద్దపెల్లి ప్రాంతానికి తమ కుటుంబం రుణపడి ఉందని మంత్రి అన్నారు. ఈ ప్రాంత ప్రజలు చలువ వల్లే తమ తండ్రీ, తాను, కుమారుడు  వంశీ పెద్దపల్లి నుంచి ఎంపీలుగా గెలిచామని గుర్తుచేశారు. మంత్రిగా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని పెద్దపల్లి ప్రజల రుణం తీర్చుకునేందుకు వినియోగిస్తానని చెప్పారు. సింగరేణి నష్టాల్లోకి వెళ్ళినప్పుడు తమ తండ్రి చేసిన కృషి వల్లే సంస్థ మళ్ళీ పురోగమిస్తోందని గుర్తుచేశారు. 

సింగరేణి నష్టాల బారిన పడి బీఐఎఫ్ఆర్ పరిధిలోకి వెళ్ళినప్పుడు కాకా వెంకటస్వామి రూ.400 కోట్లు ఎన్టీపీసీ ద్వారా ఇప్పించి లక్ష ఉద్యోగాలు కాపాడారని గుర్తుచేశారు. కార్మికులకు పెన్షన్ పథకము ఇప్పించింది కాకానేనని అన్నారు. సింగరేణిలో సీఎం పీఎఫ్ ఆఫీసును కూడా కాక పెట్టించారని తెలిపారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలిచినప్పటికీ పెద్దపల్లి నుంచి  కాంగ్రెస్ తరపున వంశీ గెలిచారంటే పెద్దపెల్లి ప్రజల ప్రేమే కారణమని అన్నారు. 

పెద్దపల్లి పెద్దకల్వల గ్రామం వద్ద మంత్రికి ఘనస్వాగతం లభించింది. పటాకులు కాల్చి పూలమాలతో అభినందనలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకోగానే.. అభిమానులు, కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు, దళిత సంఘాల నేతలు భారీ ఎత్తున చేరుకున్నారు. అప్పన్నపేట,  బసంత్ నగర్ ఏరియాలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు. 

ఆ తర్వాత ద్దపల్లి  గోదావరిఖని జీఎం కాలనీ వద్ద కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖామంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రి పదవి చేపట్టాక తొలిసారిగా గోదావరిఖనికి వచ్చిన వివేక్ ను ఎత్తుకొని సంబరాలు నిర్వహించారు పార్టీ శ్రేణులు, అభిమానులు కార్యకర్తలు‌. నేతలు మంత్రిని గజమాలతో సన్మానించారు. 

గోదావరి నది మాతకు పూలు చల్లి పూజలు చేసిన మంత్రి:

ఆ తర్వాత పెద్దపల్లి - మంచిర్యాల సరిహద్దులోని గోదావరి నదిపై ఉన్న వంతెనపై మంత్రి వివేక వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన చెన్నూరు,  మంచిర్యాల నేతలు.  వేద పండితుల మంత్రాల మధ్య స్థానికులు స్వాగతం పలికారు. గజమాలతో సత్కారం చేశారు. 

ఈ సందర్భంగా గోదావరి నది మాతకు పూలు చల్లి  పూజలు నిర్వహించిన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా సరిహద్దులో వంతెనపై పూర్ణకుంభ స్వాగతం పలికారు వేద పండితులు. అక్కడి నుంచి బైక్ ర్యాలీతో  ఇందారం సెంటర్ కు బయలుదేరారు. 

యాత్ర చెన్నూరు నియోజకవర్గం చేరుకున్న తర్వాత నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.  ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు. ఈ సందర్భంగా భారీ క్రేన్ సహాయం తో గజమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. టపాసులు, ఒగ్గు డోలు చప్పుళ్లతో, డీజే డాన్సుల తో ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ నాయకులు.

చెన్నూరులో మంత్రి వివేక్ కామెంట్స్:

సొంత నియోజకవర్గానికి భారీ ర్యాలీతో చేరుకున్న మంత్రి  వివేక్.. కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కామెంట్స్:

  • జైపూర్ మండల నాయకులు ఇంత ఘన స్వాగతం పలికినందుకు చాలా సంతోషం
  • ఎక్కడ కూడా అవినీతి లేకుండా అభివృద్ధి చేశానని గెలిపించారు
  • నేను ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా, అక్రమాలు లేకుండా అభివృధి చేస్తాను
  • ఇసుక దందా బంద్ చేయాలని ఏదైతే మీరు కోరారో.. నేను బంద్ చేసి చూపించడం జరిగింది
  • అందుకే ఇక్కడ నాకు మైనింగ్ మంత్రిగా ఇవ్వడం జరిగింది 
  • రేవంత్ రెడ్డి అక్రమ ఇసుక రవాణా జరగకుండా చూడాలని అన్నారు
  • ఇసుక రాయల్ ట్యాక్స్ తో అధిక నిధులతో అభివృద్ధి చేస్తాను
  • ప్రజా పాలనలో ఎక్కడ కూడా అన్యాయంగా అరెస్ట్ చేయడం లేదు.
  • గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారు
  • నేను ప్రతీ గ్రామానికి రూ.50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నాను
  • కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫ్రీ బస్, రూ.500 లకే గ్యాస్, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది
  • గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇస్తామని మోసం చేసింది
  • అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాను
  • ప్రభుత్వం మనకు సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది
  • విద్య పైన దృష్టి పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధించాం.
  •  సోమనపల్లి గ్రామంలో  రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి పనులు జరుగుతున్నాయి
  • నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను మీకోసమే పని చేస్తానని హామీ ఇస్తున్నాను.