
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియాకు (వీఐ) ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన క్వార్టర్లో (క్యూ4) రూ.7,166.1 కోట్ల నష్టం వచ్చింది. అంతకు ముందు క్వార్టర్లో ఈ నష్టం రూ.6,609.3 కోట్లుగా ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రకారం కంపెనీ లాస్ ఎక్కువైంది. గత ఏడాది మార్చి క్వార్టర్లో వచ్చిన నష్టం రూ.7,674.6 కోట్లతో పోలిస్తే కొంత తగ్గింది. మొత్తంగా 2024–-25 లో రూ.27,383.4 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కంపెనీ పరిస్థితులు ఇప్పటికీ మెరుగవ్వలేదు.
వొడాఫోన్ ఐడియాకు కార్యకలాపాల నుంచి కిందటేడాది డిసెంబర్ క్వార్టర్లో రూ. 11,117.3 కోట్ల రెవెన్యూ రాగా, ఈ ఏడాది మార్చి క్వార్టర్లో రూ.11,013.5 కోట్లు వచ్చాయి. మొత్తం ఆదాయం రూ. 11,228.3 కోట్లుగా ఉంది. అదే టైంలో ఖర్చులు మాత్రం రూ. 17,973.6 కోట్ల నుంచి రూ.18,396.4 కోట్లకు పెరిగాయి. కిందటేడాది మార్చి క్వార్టర్తో పోలిస్తే రెవెన్యూ 3.8 శాతం పెరిగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగాయి. వొడాఫోన్ ఐడియా కిందటేడాది మార్చి క్వార్టర్లో రూ.153 ఆర్పూ సాధించగా, ఈ ఏడాది క్యూ4 లో రూ. 175 పొందింది. రేట్లు పెంచడమే ఇందుకు కారణం.