
పాఠశాల విద్యలో ఆరు ఎన్జీఓ సంస్థలతో విద్యారంగంలో పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నూతన టెక్నాలజీ, విజ్ఞానం విద్యార్థులకు అందించడం మంచిదే. తెలంగాణ విద్యా కమిషన్ సూచించిన విధంగా.. 2వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగి ఆంగ్ల, తెలుగు మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన సందర్భంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఒకింత ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది.
ఇప్పటికే విద్యాహక్కు చట్టం -2009, నూతన విద్యావిదానం-2020 సూచించిన ప్రణాళిక ప్రకారం పాఠ్య ప్రణాళిక రూపొందించుకున్నాం. అందుకనుగుణంగానే ఈ ఆరు స్వచ్ఛంద సంస్థలు అనుసరించాల్సి ఉంటుంది.
‘ఎక్స్ స్టెప్’ సాంకేతిక శిక్షణ
స్వచ్ఛంద సంస్థలు తాము రూపొందించిన ప్రణాళికలపై శిక్షణ ఇవ్వడం, అందుకు సంబంధించిన ప్రణాళిక అందించడం చేస్తాయే తప్ప నేరుగా పాఠశాలలో బోధనను అవి పాలుపంచుకోవు. కాకుంటే ప్రాజెక్టు ఎర్రర్స్ సరిదిద్దడం కోసం అప్పుడప్పుడు మానిటరింగ్ చేస్తారు.
ప్రస్తుతం నందన్ నీలేకని నేతృత్వంలోని ‘ఎక్స్ స్టెప్’ అనే స్వచ్ఛంద సంస్థ తెలంగాణాలోని 540 పాఠశాలల ఉపాధ్యాయులకు ‘ఏఐ’లాంటి అంశంపై సాంకేతిక శిక్షణ ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇదే సంస్థ తాజాగా 33 జిల్లాల్లోని 5వేల పాఠశాలల్లో 3 నుంచి 5వ తరగతి వరకు గణితం, తెలుగు, ఆంగ్లంలో విద్యాప్రమాణాలు అభివృద్ధికి శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
గత స్వచ్ఛంద సంస్థల అనుభవాలు మనకు ఉన్నాయి. బడి బయటి పిల్లలను తిరిగి పాఠశాలలో ప్రవేశపెట్టే విషయంలో వందలాది స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో పనిచేసిన అనుభవం చూశాం. కానీ, ఫలితాలు చాలా బలహీనంగా వచ్చాయి.
నిర్దిష్ట ప్రణాళిక అవసరం
2008లో ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ ‘విప్రో ఆధ్వర్యంలో అజిత్ ప్రేమ్జీ ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థ ఉమ్మడి ఏపీలో ఓ వెయ్యి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసుకొని ప్రతి పాఠశాలకు పది కంప్యూటర్లు ఇచ్చింది. శిక్షణ ఇచ్చి ఓ ప్రోగ్రాం కూడా డిజైన్ చేసి పకడ్బందీగా అమలుచేసింది. ఆ సంస్థ ప్రోగ్రాం నుంచి వైదొలగిన తర్వాత కార్యక్రమం కొనసాగించడంలో గత ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి.
చెడిపోయిన కంప్యూటర్లు మరమ్మతు చేయించడం, ప్రతి పాఠశాలకు ఓ కంప్యూటర్ బోధకుడును
నియమించడంలో సైతం అలసత్వం వలన మెజారిటీ పాఠశాలల్లో కంప్యూటర్ శిక్షణ మూతపడింది. ఇట్లాంటి గతంలోఉన్న అనుభవాలను ప్రభుత్వం సమీక్షించుకోవాల్సి ఉంటుంది.
అలోక్ పాండే నేతృత్వంలోని ‘ఫిజిక్స్ వాలా’ సంస్థ గురుకుల పాఠశాలల్లోని 2లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ లాంటి పరీక్షలకు సంసిద్ధం చేసే ప్రణాళిక రూపొందించి అమలు జరపడం బలహీన వర్గాల పిల్లలకు ఉపయోగకరం.
ఖాన్ అకాడమీ అనే స్వచ్ఛంద సంస్థ 6-–10 తరగతుల ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైన్స్, ఇంజినీరింగ్, మేథ్స్, టెక్నాలజీ నేర్పేందుకు లేదా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఇప్పటికే తెలంగాణ ఉన్నత పాఠశాలల్లో కేవైసీ ద్వారా బోధించే డిజిటల్ బోర్డులు, ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రణాళిక అమలు బాధ్యత ఉపాధ్యాయులదే
మరో స్వచ్ఛంద సంస్థ షోయాబ్ దార్ ఆధ్వర్యంలోని ‘పైజామ్ ఫౌండేషన్’ కూడా కోడింగ్, కాంపిటేషన్ థింకింగ్ లాంటి అంశాల్లో 1-–10 తరగతుల వరకు నేర్పే మెలకువలు, ఇచ్చే శిక్షణ విద్యార్థులకు ఉపయోగకరమే. సఫీనా హుస్సేన్ నేతృత్వంలోని ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు పాఠశాలను వదిలేసిన 16 వేలమంది బాలికలను తిరిగి పాఠశాలలో చేర్చే లక్ష్యం ఉందంటున్నారు.
బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త నేతృత్వంలో కస్తూరిబా బాలికా విద్యాలయాలు, మరికొన్ని జిల్లాల్లో వీధి బాలికల పాఠశాలలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం కూడా విద్యా బాధ్యతల నుంచి బయటపడడానికి, వైదొలగటానికి కార్పొరేట్ శక్తులు, ప్రైవేటు విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మీదనే పూర్తి ఆధారం మోపకుండా భావిభారత పౌరులను తీర్చిదిద్దే ప్రాథమిక చర్యలు తీసుకోవాలి.
- ఎన్.తిర్మల్, విశ్లేషకుడు-