
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ (కె.ఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతోంది. దీంతో వరుసగా అప్ డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు. చిరు సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇటీవలే రిలీజైన ‘బాస్ పార్టీ’ సాంగ్ ఆకట్టుకుంది. లెటెస్ట్ గా సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
‘నువ్వు సీతవైతే నేను రాముడినంటా..నువ్వు రాధావైతే నేను కృష్ణుడినంటా’ అంటూ సాంగ్ మొదలైంది. చివరిలో ‘నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. ? నేనే చిరంజీవంటా’ అంటూ సాంగ్ ముగిసింది. జస్ప్రీత్ జాస్జ్, సమీరా భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు. అందమైన మంచుకొండల నడుమ ఈ సాంగ్ ను చిత్రీకరించారు. స్టైలిష్ గా కనిపిస్తున్న చిరు అదిరిపోయే స్టెప్పులేశారు. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశారు. మైత్రీవారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 13న సంక్రాంతి కానుకగా 'వాల్తేరు వీరయ్య' మూవీ విడుదల కానుంది.