
పాన్గల్, వెలుగు: వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి లెక్కల మాస్టారుగా మారారు. పదో తరగతి విద్యార్థులకు డిజిటల్ బోర్డుపై లెక్కలు చెప్పారు. బుధవారం పాన్గల్ మండల కేంద్రంలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాల, ఎస్సీ వాడలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, మాధరావుపల్లి ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. పాన్గల్ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మ్యాథ్య్ బోధించి, వారితో బోర్డుపై లెక్కలు చేయించారు. విద్యార్థులకు మథ్స్ పర్ఫెక్ట్గా చెప్పాలని హెచ్ఎం విజయ్ని ఆదేశించారు.
ప్రాథమిక మిక పాఠశాలలో విద్యార్థుల జాయినింగ్ కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయుడు వీరస్వామి, పాన్గల్ ఉపాధ్యాయుడు వెంకటేశ్ను అభినందించారు. మాధరావుపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. గ్రామానికి 57 ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 36 ఇండ్లకు ముగ్గులు పోసి 17 ఇండ్లు స్లాబ్ వరకు పూర్తయ్యాయని తెలుసుకున్న కలెక్టర్సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణం ప్రారంభించని వాళ్ల ఇండ్లు రద్దు చేసి అర్హత ఉన్న ఇతరులకు సిఫారసు చేయాలని మండల అభివృద్ధి అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో అబ్దుల్ ఘని, పీడీ డీఆర్డీవో ఉమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, తహసీల్దార్ సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీవో గోవింద రావు, ఎంఈవో శ్రీనివాస్, ఏపీఎం వెంకటేశ్ యాదవ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి
వనపర్తి, వెలుగు: వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో వైద్యశాఖ అధికారులతో సీజనల్ వ్యాధులు, టీబీ నిర్మూలన, ఏఎన్ సీ నమోదు, పీహెచ్సీలలో ప్రసవాల సంఖ్య పెంచటం పై సమీక్ష నిర్వహించారు. ఫ్రైడే డ్రైడే నిర్వహించడమే కాకుండా దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
క్షయ వ్యాధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలని, ఇప్పటికే గుర్తించిన 567 మంది వ్యాధిగ్రస్తులకు క్రమం తప్పకుండా మందులు వేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి శస్త్ర చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇందులో క్యాటరాక్ట్ సర్జరీలు ఉచితంగా చేస్తారని, ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఈ ఆస్పత్రిలో 50 నుంచి 60 శస్త్ర చికిత్సలు జరిగాయని, ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదని తెలిపారు. సమీక్షలో డీఎంహెచ్వో శ్రీనివాసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ రంగారావు, ప్రోగ్రాం ఆఫీసర్లు సాయినాథ్ రెడ్డి, పరిమళ తదితరులు పాల్గొన్నారు.