వనపర్తి, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్ లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులు స్వయంగా వచ్చి విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుందని, ప్రతిపాదిత వ్యక్తి, ఏజెంట్ ద్వారా విత్డ్రా ఫారం అందజేస్తే అభ్యర్థికి ఫోన్ చేసి నిర్ధారించుకోవాలని సూచించారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం నర్సింగాయపల్లి డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ యాదయ్య, డిప్యూటీ సీఈవో రామ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.
గద్వాల: ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అభ్యర్థులకు గుర్తులు కేటాయించాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. కలెక్టరేట్ లో అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు, బ్యాలెట్ పేపర్స్ ముద్రణపై రిటర్నింగ్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల డ్యూటీ చేసే వారందరికీ పోస్టల్ బ్యాలెట్ అందించనున్నట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ నర్సింగ్రావు, డిప్యూటీ సీఈవో నాగేంద్రం, నోడల్ అధికారులు శ్రీనివాస్రావు, రమేశ్ బాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
