
- జూన్ నెలలో బియ్యం పంపిణీ ప్రారంభం
వనపర్తి, వెలుగు: కొత్త రేషన్కార్డుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఊరట లభించింది. కొత్తగా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం, కార్డుల్లో చేరికలు, మార్పులు కోరుతూ చేసుకున్న దరఖాస్తులను పరిశీలన అనంతరం అధికారులు ఆమోదం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను స్ర్కీనింగ్ చేసి కొత్త కార్డులను జారీ చేస్తున్నారు. మార్పులు, చేర్పులు చేసిన వాటి వివరాలను కీ రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. ఈ మేరకు కార్డుదారులకు సమాచారం ఇస్తున్నారు. మొదటి విడతలో వనపర్తి జిల్లాలో 1,974 కొత్త రేషన్కార్డులకు అప్రూవల్ ఇచ్చారు.
నెల రోజుల తరువాత ఫిజికల్ కార్డులు జారీ చేయనున్నారు. మార్పు, చేర్పుల తరువాత కొత్తగా 36,835 మందికి వచ్చే నెల నుంచి రేషన్ బియ్యం ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,57,369 ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉండగా, 5,16,962 మందికి బియ్యం కేటాయించారు. రేషన్కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి కొత్త కార్డులను జారీ చేస్తామని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.