
- మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో ఆఫీసర్లు
వెలుగు, నెట్ వర్క్: డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, విద్యార్థులు, యువత డ్రగ్స్ దూరంగా ఉండాలని పోలీసులు అన్నారు. ఆయా జిల్లాల్లో పోలీసులు అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణ వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించారు. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ బుధవారం జె.ఎస్.రాములు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తాయన్నారు. మంగళవారం రాయలగండి కస్తూరిబా స్కూల్, పదర జడ్పీ హై స్కూల్లో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు అవగాహన కల్పించారు.
కోడేరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్ లో బుధవారం ఎస్సై డి. జగదీశ్వర్ పాల్గొని డ్రగ్స్, మత్తు పదార్థాల వల్ల కలిగే హాని గురించి స్టూడెంట్స్ కు తెలియజేశారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి. రజని అన్నారు. సీవీరామన్ జూనియర్ కాలేజీలో మాదకద్రవ్యాల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
పీయూలోని ఫార్మసీ కాలేజీలో ఎన్ఎస్ఎస్సెల్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. పాలమూరు ఎస్పీ జానకి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు స్టూడెంట్స్ కు వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.