- సెన్సెక్స్ 1,236, నిఫ్టీ 365 పాయింట్లు డౌన్
- ఇన్వెస్టర్లకు రూ.7.55 లక్షల కోట్లు నష్టం
- అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి
ముంబై: వరుసగా మూడు సెషన్లలో లాభాల్లో కదిలిన బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ గురువారం భారీగా పతనమయ్యాయి. ఇరాన్పై అమెరికా దాడులు చేస్తుందనే భయాలు, ఫెడ్ వైఖరిలో అనిశ్చితి మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. వీటికితోడు క్రూడాయిల్ ధరలు పెరగడం, అమెరికా బాండ్ యీల్డ్స్ పెరుగుదల, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపడంతో అన్ని సెక్టార్ల ఇండెక్స్లు రెడ్లో ట్రేడయ్యాయి. ఇన్వెస్టర్లు ఒక్క సెషన్లోనే రూ.7.55 లక్షల కోట్లు నష్టపోయారు.
మార్కెట్ ఇలా..
30 షేర్ల సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,400 పాయింట్లు పైగా పడి, చివరికి 1,236 పాయింట్లు (సుమారు 1.48శాతం) నష్టంతో 82,498 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 25,400 కిందకు జారింది. చివరికి 365 పాయింట్లు (సుమారు 1.41శాతం) నష్టంతో 25,454 వద్ద సెటిల్ అయింది. బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 464 లక్షల కోట్లకు తగ్గింది. బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి కనిపించగా, సెన్సెక్స్లోని 30 స్టాక్స్ అన్నీ రెడ్లో ముగిశాయి.
ఇండిగో, ఎం అండ్ ఎం, బెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, అదానీ పోర్ట్స్, రిలయన్స్ షేర్లు 3.5శాతం వరకు పతనమయ్యాయి. 50 షేర్లున్న నిఫ్టీ ఇండెక్స్లో కేవలం 3 స్టాక్స్ మాత్రమే లాభాల్లో ముగిశాయి. ఓఎన్జీసీ, హిందాల్కో, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ నెగెటివ్ ట్రెండ్ను ఎదుర్కొని లాభపడ్డాయి. బీఎస్ఈలో 2,927 స్టాక్స్ గురువారం పడిపోగా, 1,276 స్టాక్స్ లాభపడ్దాయి. 164 షేర్లలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఇన్వెస్టర్ల భయాన్ని కొలిచే ఇండియా విక్స్ (వాలటిలిటీ గేజ్) 10శాతానికి పైగా పెరిగి 13.50 కి చేరింది.
పతనానికి కారణాలు..ఇరాన్పై అమెరికా దాడి భయాలు..
మిడిల్ ఈస్ట్లో అమెరికా మిలిటరీ జోక్యం పెరుగుతోంది. వార్షిప్స్, ఫైటర్ జెట్స్, రీఫ్యూలింగ్ ఎయిర్క్రాఫ్ట్ల మోహరింపు జరుగుతోంది. ట్రంప్ అనుమతిస్తే అమెరికా ఎప్పుడైనా దాడి చేయొచ్చు. ఇరాన్ నూక్లియర్ సైట్లపై గతంలో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య నూక్లియర్ డీల్ కుదరకపోతే మిడిల్ఈస్ట్లో టెన్షన్స్ మరింత ముదురుతాయి. దీంతో గ్లోబల్గా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోంది.
మార్కెట్లు పడుతున్నాయి. ఫెడ్ రేట్లు తగ్గించకపోవచ్చు!
రేట్ల కోతలో ఫెడ్ అధికారులు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జనవరి మీటింగ్ మినిట్స్ ప్రకారం, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే రేట్ల కోతను ఆలస్యం చేయాలని కొంతమంది, తగ్గించాలని మరికొంత మంది భావిస్తున్నారు. రేట్ల కోత ఆలస్యమైతే అమెరికా బాండ్ యీల్డ్స్ ఇంకా గరిష్ట స్థాయిల్లో కొనసాగుతాయి. ప్రస్తుతం అమెరికా పదేళ్ల ట్రెజరీ బాండ్స్ 4.10శాతం వడ్డీ ఇస్తున్నాయి. -స్ట్రాంగ్ ఎకనామిక్ డేటా వల్ల ఫెడ్ రేట్స్ హోల్డ్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా వంటి ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి విదేశీ పెట్టుబడులు వెళ్లిపోతాయి. రూపాయి విలువ పడుతుంది. కాగా, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు గురువారం నికరంగా రూ.880 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.
క్రూడ్ ఆయిల్ ధరలు జూమ్..
బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 70.59 డాలర్లకి చేరింది. గత ఏడాది కాలంలో ఇదే గరిష్ట స్థాయి. అమెరికాకు చెందిన డబ్ల్యూటీఐ క్రూడ్ 65.47 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. ఇరాన్పై అమెరికా దాడి చేస్తే హార్ముజ్ జలసంధి నుంచి సప్లయ్లకు అంతరాయం ఏర్పాడుతుందనే భయాలు ఉన్నాయి. అదే జరిగితే ఇండియాలో ఇంధన ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
ప్రాఫిట్ బుకింగ్:
మూడు రోజుల గెయిన్స్ తర్వాత హై లెవల్స్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. గ్లోబల్ అనిశ్చితి పరిస్థితిల్లో లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు.
