ఇవాళ్టితో ముగియనున్న ఎమ్మెల్సీ ప్రచారం

ఇవాళ్టితో ముగియనున్న ఎమ్మెల్సీ ప్రచారం
  • నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ప్రచారం
  • హోరాహోరీగా క్యాంపెయిన్ చేస్తున్న అభ్యర్థులు
  • ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు పార్టీలు

హైదరాబాద్, వెలుగు:  వరంగల్–-ఖమ్మం-–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ ప్రచారం శనివారం సాయంత్రం ముగియనుంది. ఈ ఒక్క రోజే సమయం ఉండడంతో మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలతో విస్తృతంగా తిరుగుతున్నారు. సన్నాహక భేటీలతో పట్టభద్రులను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. నిరుద్యోగ, ఉద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలంటూ అభ్యర్థిస్తున్నారు. మూడు పార్టీలు కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని.. నిరుద్యోగులు కాంగ్రెస్ పక్షాన ఉన్నారని చెప్పడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచి తీరాల్సిందేనని ఆ పార్టీతో పట్టుదలతో ముందుకు వెళ్తున్నది. కాంగ్రెస్​కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో బీజేపీ ఉందని చూపించేందుకు ఆ పార్టీ గెలుపుకోసం ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్నకు మంత్రులు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉండగా.. ఆయన కూడా వినూత్నంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఆయన కోసం మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్​రావులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

27న ఆ జిల్లాల్లో ఉద్యోగులకు సీఎల్

ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రైవేట్ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని చట్టంలో లేదని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో సూచించారు. ప్రైవేట్ కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ సిబ్బంది ఓటు వేసేందుకు వీలుగా షిఫ్టుల సర్దుబాటు లేదా ఆలస్యంగా వచ్చేందుకు లేదా మధ్యలో వెళ్లి ఓటు వేసి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కోరారు.