వరంగల్ కేంద్రంగా ఫేక్​ సర్టిఫికెట్ల దందా

వరంగల్ కేంద్రంగా ఫేక్​ సర్టిఫికెట్ల దందా
  • అఫీషియల్ వెబ్ సైట్ హ్యాక్ చేసి అప్​లోడ్​
  • అమ్మిన ఆరుగురు.. కొన్న మరో ఆరుగురు అరెస్ట్
  • పరారీలో మరో ముగ్గురు నిందితులు
  • 88 సర్టిఫికెట్లు, రూ.5.37 లక్షలు స్వాధీనం

హనుమకొండ, వెలుగు: దేశంలోని వివిధ యూనివర్సిటీల పేరుతో ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి, అఫీషియల్​ వెబ్​సైట్స్​లో పెట్టి సొమ్ము చేసుకుంటున్న ముఠాను వరంగల్​ టాస్క్​ఫోర్స్, హసన్​పర్తి పోలీసులు పట్టుకున్నారు. లక్ష రూపాయలిస్తే డిగ్రీ, లక్షన్నర ముట్టజెప్తే ఫేక్​ ఇంజినీరింగ్​ పట్టా తయారు చేసి ఇచ్చేవారు. ముఠాలోని ఆరుగురితో పాటు నకిలీ సర్టిఫికెట్లు కొన్న ఆరుగురిని అరెస్ట్​ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉండగా.. పట్టుబడిన వారి నుంచి రూ.5.37 లక్షల నగదు, 88 నకిలీ సర్టిఫికెట్లు, నాలుగు స్టాంప్స్​, 16 సెల్​ఫోన్లు, ప్రింటర్​, సీపీయూ స్వాధీనం చేసుకున్నారు. ఇన్నాళ్లూ నకిలీ సర్టిఫికెట్ల తయారీ వరకే ఉన్న దందా కాస్తా.. యూనివర్సిటీల అఫీషియల్​ వెబ్​సైట్స్​లో చొరబడి అప్​లోడ్ చేసే దాకా రావడంతో పోలీసులు అలర్ట్​ అయ్యారు. అరెస్ట్​కు సంబంధించిన వివరాలను వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి బుధవారం వెల్లడించారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆకుల రవి అలియాస్ అవినాశ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన లంకల శంకర్​రావు, హనుమకొండకు చెందిన మీరా అక్తర్ అలీ బేగ్, హైదరాబాద్​కు చెందిన సుడిగ ఎల్లేశ్, ముప్పూరి పురుషోత్తం, కామన ప్రీతమ్ ఈజీ మనీ కోసం ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసే దందాకు తెరలేపారు. 

అఫీషియల్ వెబ్ సైట్ హ్యాక్ చేసి..

ఈ గ్యాంగ్ ఫేక్ సర్టిఫికెట్లు పొందిన వ్యక్తుల వివరాలను సంబంధిత వర్సిటీ అఫీషియల్ వెబ్ సైట్​ను హ్యాక్ చేసి అందులో ఎంటర్ చేయించేవారు. ఈ పనంతా ఇదివరకే వీరికి పరిచయమున్న యూపీకి చెందిన సర్వేశ్ సహాయంతో చేశారు. ఇలా కాకతీయ యూనివర్సిటీ, ఆంధ్రా, నాగార్జున, శ్రీ వేంకటేశ్వర దేవర్య, అన్నం, ఢిల్లీ వర్సిటీలతో పాటు తెలంగాణ, ఏపీలకు చెందిన ఇంటర్మీడియట్ బోర్డు, ఓపెన్​స్కూల్ కు సంబంధించిన సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. ఇలా ఇప్పటిదాకా దాదాపు 665కి పైగా వివిధ విద్యార్హతలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి అమ్మారు. వీరి నుంచి ఫేక్​సర్టిఫికెట్లు పొందిన127 మందిని పోలీసులు ఇప్పటికే గుర్తించగా.. మిగతా వారి కూపీ లాగుతున్నారు. ముఠా సభ్యులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్​ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్​, ఏసీపీ డా.ఎం.జితేందర్​రెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, నరేశ్​కుమార్, హసన్​పర్తి సైబర్ క్రైమ్ సీఐలు నరేందర్, జనార్దన్ రెడ్డి, ఎస్సైలు నిస్సార్ పాషా, లవన్ కుమార్, భరత్, ఏఏవో సల్మాన్ పాషా, సిబ్బంది సోమలింగం, మాధవ రెడ్డి, స్వర్ణలతలను సీపీ అభినందించారు.

ఫేక్​ సర్టిఫికెట్స్​తో విదేశాలకు

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవాళ్లకు నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. మూడేండ్ల గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్​ను రూ.లక్ష, నాలుగేండ్ల ఇంజినీరింగ్, ఆపై చదువులకు సంబంధించిన సర్టిఫికెట్లకు రూ.లక్షన్నర, రూ.2 లక్షలు తీసుకుని ఇచ్చేవారు. ఈ క్రమంలోనే వివిధ సర్టిఫికెట్ల కోసం సికింద్రాబాద్​కు చెందిన ఐనవోలు సాయి శ్రావణ్​, గుంటూరుకు చెందిన కోటా అశోక్​, నల్గొండకు చెందిన గండికోట సందీప్, హైదరాబాద్​కు చెందిన మనోజ్​సింగ్, వనపర్తికి చెందిన తల్లూరి సంప్రీత్​, చిదురాల లక్ష్మీప్రసాద్ ఈ ముఠాను సంప్రదించారు. వీరికి కూడా సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు వరంగల్ టాస్క్​ఫోర్స్​ పోలీసులకు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. ఈ క్రమంలో బుధవారం ముఠాను పట్టుకుని 12 మందిని అరెస్ట్​ చేశారు. బట్ట సందీప్​, మెండి విజయ్, యూపీకి చెందిన సర్వేశ్ పరారీలో ఉన్నారు.