గ్రేటర్ వరంగల్/ నర్సంపేట/ పర్వతగిరి, వెలుగు: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను రెండు రోజుల్లో సమర్పించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి సంబంధించిన ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్లో 99 రోజుల ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమగ్రంగా చర్చించారు.
ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయాలన్నారు. అనంతరం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో పిచ్చుకలను ప్రకృతిలోకి విడుదల చేశారు. అనంతరం నర్సంపేట మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు.
మొక్కజొన్న క్వింటాల్కు రూ.2,400ల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని, రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. పర్వతగిరి పీహెచ్సీని కలెక్టర్ సత్యశారద డీఎంహెచ్వో సాంబశివరావుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి, రిజిస్టర్లు, మెడిసిన్ నిల్వలు, పరిశుభ్రతను పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడుతూ వైద్య సేవలపై ఆరా తీశారు.
