గ్రేటర్ వరంగల్, వెలుగు: బాలికల భద్రత, సంక్షేమంపై వార్డెన్లు ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి అన్నారు. శుక్రవారం సిటీలోని నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు చెందిన కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాల (కేజీబీబీ) వార్డెన్ల సాధికారత లక్ష్యంగా జనవరి 19 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించగా, ముగింపు సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. స్పెషల్ ఆఫీసర్, కేర్టేకర్గా పని చేయడం కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, అది ఒక గొప్ప సేవ అని, బాలికల భవిష్యత్ను తీర్చిదిద్దే కీలక బాధ్యతను నిర్వర్తిస్తున్నారని వార్డెన్లను అభినందించారు.
బాలికలను సొంత పిల్లల్లా చూసుకుంటూ వారి భౌతిక, మానసిక, భావోద్వేగ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వరంగల్ డీఈవో రంగయ్య నాయుడు, జీసీడీవోలు కె.ఫ్లోరెన్స్, సునీత, వరంగల్ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన తేజ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్పై సమీక్ష నిర్వహించారు. వరంగల్ జిల్లాలో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ నమోదు ప్రక్రియను వంద శాతం పూర్తిచేయాలని ఆదేశించారు.
