గ్రేటర్ వరంగల్/ కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం కాజీపేట ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు ఖర్చు చేసి కావలసిన భూములు, అనుమతులను కేంద్రానికి అప్పజెప్పిందన్నారు.
కానీ, కిషన్ రెడ్డి మాత్రం అడుగుదూరంలో ఉన్న పనులను అడ్డుకున్నాడన్నారు. గత నెలలోనే పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా, ఆయనే వాయిదా వేయించాడన్నారు. అనంతరం ఎమ్మెల్యే పోతన నగర్ చెరువు ఆయకట్టు ప్రాంతాన్ని మాజీ మేయర్గుండు సుధారాణి, కుడా చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్బాజ్పాయ్తో కలిసి సందర్శించారు. వరదల సమయంలో ఎలాంటి నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు సూచించారు.
