
- తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య
- ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే కారణమని అనుమానం
నర్సంపేట, వెలుగు : జమ్మూకశ్మీర్లో ఆర్మీ జవాన్గా పనిచేస్తున్న, వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... నర్సంపేట పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన సంపంగి నాగరాజు (27) నాలుగేండ్ల కింద ఆర్మీకి సెలెక్ట్ అయి జమ్మూకశ్మీర్లో జవాన్గా పనిచేస్తున్నాడు. రెండేండ్ల కింద ఆయనకు వివాహమైంది. తర్వాత కొన్ని రోజులకే భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది.
ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు.. మరో వైపు కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన నాగరాజు రెండు రోజుల కింద తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆర్మీ ఆఫీసర్లు నాగరాజు కుటుంబ సభ్యులకు చెప్పారు. సోమవారం సాయంత్రం నాగరాజు డెడ్బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించగా.. మంగళవారం మధ్యాహ్నం నర్సంపేటకు తీసుకొచ్చారు. సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు.