
న్యూఢిల్లీ: దక్షిణాదిలోని మూడు ప్రధాన నగరాలు - బెంగళూరు, హైదరాబాద్ చెన్నైలలో వేర్హౌసింగ్ (గిడ్డంగులు) స్థలాల లీజు 5 శాతం తగ్గి 10.2 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుందని వెస్టియన్ తాజా రిపోర్ట్ తెలిపింది. గత సంవత్సరంలో డిమాండ్ తగ్గింది. 2022 క్యాలెండర్ సంవత్సరంలో ఈ మూడు నగరాల్లోని మొత్తం 10.7 మిలియన్ చదరపు అడుగుల గిడ్డంగుల స్థలాన్ని లీజుకు ఇచ్చారు. థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ సంస్థలు, ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు, ఈ–-కామర్స్ సంస్థలు ఎక్కువగా గిడ్డంగుల స్థలాలను లీజుకు తీసుకుంటాయి.
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ డేటా ప్రకారం, ఈ మూడు దక్షిణాది నగరాల వాటా అంతకుముందు సంవత్సరంలో 34 శాతం నుంచి 2023లో 27 శాతానికి పడిపోయింది. ఏడు ప్రధాన నగరాల్లో, వేర్హౌసింగ్ లాజిస్టిక్స్ స్థలాల లీజు గత సంవత్సరంలో 31.2 మిలియన్ చదరపు అడుగుల నుంచి 2023లో 21 శాతం పెరిగి 37.8 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. బెంగళూరులో డిమాండ్ 4.1 మిలియన్ చదరపు అడుగుల నుంచి 3.6 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది.
హైదరాబాద్లో కూడా గత ఏడాది 3.7 మిలియన్ చదరపు అడుగుల నుంచి 3.1 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. అయితే, చెన్నైలో ఆఫీసు స్థలాల లీజింగ్ 2.9 మిలియన్ చదరపు అడుగుల నుంచి 3.5 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ముంబైలో, గిడ్డంగుల లీజు 6 మిలియన్ చదరపు అడుగుల నుంచి 10.2 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ఢిల్లీ–-ఎన్సీఆర్లో డిమాండ్ 7.3 మిలియన్ చదరపు అడుగుల నుంచి 8.8 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. పూణేలో, గిడ్డంగుల లీజు 5.2 మిలియన్ చదరపు అడుగుల నుంచి 7 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. కోల్కతాలో, గిడ్డంగులు లాజిస్టిక్ స్థలాల లీజు 2.1 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.6 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది.