- ఏపీ, తెలంగాణ పోటాపోటీ కరెంట్ ఉత్పత్తి ఫలితం
- అడుగంటిన రిజర్వాయర్
- పంపింగ్కు అందుబాటులో ఉన్నది ఒక్క టీఎంసీనే
- నీటిని నాగార్జునసాగర్లోకి వదిలేస్తున్న ఏపీ
- ఆంధ్రా సర్కారు తప్పులను ఎత్తిచూపడంలో మన రాష్ట్ర సర్కారు ఫెయిల్
హైదరాబాద్, వెలుగు: మూడు వేల ఊర్లకు తాగునీటి గండం తరుముకొస్తున్నది. 19 మున్సిపాలిటీల్లోనూ నీటి కటకట మొదలు కాబోతున్నది. ఏపీ, తెలంగాణ పోటాపోటీగా కరెంట్ ఉత్పత్తితో శ్రీశైలం రిజర్వాయర్ అడుగంటింది. ఈ రిజర్వాయర్ నుంచి తాగునీళ్ల కోసం ఎత్తిపోసేందుకు ఒక్క టీఎంసీ నీళ్లే అందుబాటులో ఉన్నాయి. మనోళ్లు కరెంట్ ఉత్పత్తి చేసిన నీటిని రివర్స్ పంపింగ్ చేస్తున్నా, ఏపీ మాత్రం ఇష్టారాజ్యంగా నాగార్జునసాగర్లోకి వదిలేస్తున్నది. దీంతో మహబూబ్నగర్ జిల్లాలోని 12, రంగారెడ్డి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు తాగునీటి కష్టాలు పొంచి ఉన్నాయి. ఈ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 3 వేల గ్రామాలు, 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏపీ జలదోపిడీకి పాల్పడుతున్నా దాన్ని ఎత్తిచూపడంలో మన రాష్ట్ర సర్కారు ఫెయిలైంది. శ్రీశైలం నీటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేయకపోగా, ఏపీ జలదోపిడీని ఏమాత్రం కంట్రోల్ చేయలేదు. తెలంగాణ కరెంట్ ఉత్పత్తిపై ఇంతెత్తున లేచే కృష్ణా బోర్డు.. ఏపీ వ్యవహార శైలిపై నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తీరుతో మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 3 వేల గ్రామాలకు తాగునీళ్లు దొరకని పరిస్థితి తలెత్తనుంది. 19 మున్సిపాలిటీలకూ నీటి సమస్య ఎదురుకాబోతున్నది. శ్రీశైలంలో రెండు రాష్ట్రాలు పోటాపోటీగా కరెంట్ ఉత్పత్తి చేసి నీళ్లన్నీ నాగార్జునసాగర్కు వదిలేశాయి. ఇలా కరెంట్ ఉత్పత్తి ద్వారానే 639 టీఎంసీల వరకు నీళ్లు నాగార్జునసాగర్లోకి చేరాయి. ఈనెల మొదటివారంలో శ్రీశైలం రిజర్వాయర్లో నీటిమట్టం 826 అడుగులు ఉండగా, కేవలం 20 రోజుల్లోనే 23 అడుగులకు పైగా (17.40 టీఎంసీలు) నీటిని కరెంట్ ఉత్పత్తి ద్వారా సాగర్లోకి వదిలేశారు. దీంతో కల్వకుర్తి (ఎల్లూరు) పంపుహౌస్ నుంచి తాగునీటిని లిఫ్ట్ చేసుకోలేని పరిస్థితి తలెత్తింది. శ్రీశైలంలో 800 అడుగుల లెవెల్లో నీటిమట్టం ఉంటే రేగుమానుగడ్డ అప్రోచ్ చానల్ నుంచి నీటిని తీసుకొని ఎల్లూరు పంపుహౌస్ నుంచి లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. బుధవారం నాటికి శ్రీశైలం నీటిమట్టం 803.6 అడుగులు కాగా.. 30.83 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇందులో తాగునీటి అవసరాలకు కేవలం ఒక్క టీఎంసీ నీళ్లే అందుబాటులో ఉన్నాయి. నిరుడు ఇదే రోజు శ్రీశైలంలో 109 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. పీక్ అవర్స్లో కరెంట్ డిమాండ్ పేరుతో రెండు రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా కరెంట్ ఉత్పత్తి చేసి ఫిబ్రవరిలోనే రిజర్వాయర్ అడుగంటేలా చేశాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఒక్క టీఎంసీ నీళ్లు నెల రోజులకు మాత్రమే సరిపోతాయి. బుధవారం కరెంట్ ఉత్పత్తి కోసం తెలంగాణ ఉపయోగించిన 660 క్యూసెక్కుల నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా రిజర్వాయర్లో పోయగా.. ఏపీ మాత్రం కరెంట్ ఉత్పత్తి చేసి 2,150 క్యూసెక్కులను నాగార్జునసాగర్లోకి వదిలేసింది. ఏపీ ఇట్లనే వ్యవహరిస్తే ఉన్న ఒక్క టీఎంసీ నీళ్లు నాలుగు రోజుల్లో సాగర్లోకి చేరుతాయి. అదే జరిగితే మార్చి మొదటి వారంలోనే మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 3వేల గ్రామాలకు, 19 మున్సిపాలిటీలకు నీటి కష్టాలు మొదలయ్యే ప్రమాదం ఉంది.
మిషన్ భగీరథకు నీళ్లు ఎట్లా?
ఎల్లూరు రిజర్వాయర్ నుంచి ఎల్లూరు వాటర్ గ్రిడ్ (మిషన్ భగీరథ)కు నీటిని సరఫరా చేసి అక్కడి నుంచి గౌరిదేవిపల్లి, కల్వకుర్తి, కర్కల్పహాడ్, కమ్మదనం, రాఘవాపూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు నీటిని సరఫరా చేస్తారు. అక్కడి నుంచి మహబూబ్ నగర్ జిల్లాలోని 12 నియోజవర్గాల (గద్వాల్, ఆలంపూర్ మినహా) పరిధిలోని, రంగారెడ్డి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 3,008 గ్రామాలు, 19 మున్సిపాలిటీలకు తాగునీళ్లు ఇస్తారు. మే నెలాఖరు వరకు కల్వకుర్తి నుంచి తాగునీటికే 3 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరింది. శ్రీశైలంలో నీళ్లు లేకపోవడంతో ఇప్పుడు ఆయా గ్రామాలకు తాగునీళ్లు ఎట్లా ఇవ్వాలో అంతుచిక్కడం లేదు. పది రోజుల కిందట్నే రిజర్వాయర్లో నీటి మట్టం 809 అడుగులకు పడిపోయింది. అప్పటి వరకు తాగునీటికి 5.50 టీఎంసీలు అందుబాటులో ఉండగా.. ఆ నీటిని ఏపీ పవర్ జనరేషన్ చేసి సాగర్లోకి వదిలేసింది. ఏపీకి రివర్స్ పంపింగ్ సిస్టం లేకపోయినా ఆ రాష్ట్రం కరెంట్ ఉత్పత్తి మాత్రం ఆపడం లేదు. ఇలా తెలంగాణ తిప్పిపోసిన నీళ్లనూ ఏపీ వృథాగా సాగర్లోకి వదిలేస్తున్నది. రేపు తాగునీళ్ల కోసం సాగర్ బ్యాక్ వాటర్ను రివర్స్ పంపింగ్ చేసినా ముచ్చుమర్రి నుంచి ఏపీ పంపింగ్ చేసే అవకాశముంది. భగీరథ నీటి అవసరాలు ఎట్లా తీర్చాలో అంతుబట్టడం లేదు.
వినియోగంలో ఏపీ టాప్
శ్రీశైలం రిజర్వాయర్కు ప్రస్తుత ఫ్లడ్ సీజన్లో 1,090.42 టీఎంసీల వరద వచ్చింది. ఇందులోంచి రెండు రాష్ట్రాలు 230 టీఎంసీలు వినియోగించుకోగా.. అందులో తెలంగాణ వాటా 32 టీఎంసీలు మాత్రమే. శ్రీశైలం నుంచి ప్రస్తుత వాటర్ ఇయర్లో 400 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయి. కరెంట్ ఉత్పత్తి ద్వారా 639 టీఎంసీలకు పైగా నీళ్లు నాగార్జునసాగర్కు తరలించారు. ఇందులో కేవలం 9 టీఎంసీల మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ పంప్ చేసింది. సాగర్ ప్రాజెక్టు, కృష్ణా డెల్టా సిస్టం కింద సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడే శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేసి నీటిని సాగర్కు విడుదల చేయాలి. దిగువన నీటి అవసరాలు లేకుంటే తెలంగాణ పవర్ జనరేట్ చేసి నీటిని రివర్స్ పంపింగ్ చేసుకోవచ్చు. ఫ్లడ్ సీజన్ ఆరంభంలో శ్రీశైలంలో తెలంగాణ కరెంట్ ఉత్పత్తి చేసిందని ఏపీ గగ్గోలు పెట్టింది. ఏపీ సీఎం జగన్ ఏకంగా ప్రధానికి కంప్లయింట్ చేశారు. ఏపీ ఫిర్యాదుల ఆధారంగా కృష్ణా బోర్డు.. తెలంగాణ కరెంట్ ఉత్పత్తిపై జోక్యం చేసుకోవాలని సెంట్రల్ పవర్ మినిస్ట్రీకి నివేదించింది. అప్పుడు పోతిరెడ్డిపాడు కోసం గగ్గోలు పెట్టిన ఏపీ, ఇప్పుడు దాని ద్వారా నీళ్లు తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో తెలంగాణకు తాగునీళ్లు కూడా దొరకకుండా కరెంట్ఉత్పత్తి చేస్తూ నీళ్లు వృథాగా నాగార్జునసాగర్లోకి వదిలేస్తున్నది.
వారం కిందట్నే కల్వకుర్తి పంపులు బంద్
శ్రీశైలంలోని నీటిని ఏపీ వృథా చేస్తున్నా.. ఉన్న నీటినైనా ఎత్తిపోసుకునే ప్రయత్నం మన సర్కారు చేయడం లేదు. కల్వకుర్తి లిఫ్ట్ స్కీం పరిధిలోని ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు మోటార్లు వారం కిందట్నే బంద్ చేశారు. ఈ వాటర్ ఇయర్ కృష్ణాలో వరదలు వచ్చినా కాల్వలు పటిష్టంగా లేకపోవడంతో పూర్తి కెపాసిటీ మేరకు నీళ్లు లిఫ్ట్ చేయలేదు. కొన్ని రోజులు నడిపి మోటార్లు బంద్ చేశారు. నవంబర్ నుంచి ఎత్తిపోతలు కొనసాగిస్తూ ఈ నెల 15న మోటార్లు ఆపేశారు. కల్వకుర్తి లిఫ్ట్ కింద 28, 29, 30 ప్యాకేజీల పరిధిలో 1.46 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పల్లి, మక్క పంటలకు రెండు తడులు ఇవ్వాల్సి ఉంది. ఆ ఆయకట్టును గట్టెక్కించడానికి రైతులు బోర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి.
ఇప్పుడు మిషన్ భగీరథ కోసం రోజుకు 80 క్యూసెక్కుల నీటిని మాత్రమే పంప్ చేస్తున్నారు.
ఏపీ దోపిడీపై సర్కార్ మౌనం
శ్రీశైలం నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. శ్రీశైలంలో పూర్తి స్థాయి నీళ్లున్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏపీ రోజుకు 4 టీఎంసీలకు పైగా నీళ్లు తరలించుకుపోతుంది. హెచ్ఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి ద్వారా ఇంకో టీఎంసీ వరకు ఎత్తిపోసుకుంటుంది. రోజుకు టీఎంసీకి పైగా నీళ్లు తరలించే వెలిగొండ టన్నెల్ నిర్మాణం పూర్తి కావొచ్చింది. రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే ‘సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీం’ పనులను ఏపీ ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తున్నది. వీటిలో ఏ ఒక్క ప్రాజెక్టును అడ్డుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించలేదు. పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే నీళ్లను 600 కి.మీ.ల దూరానికి తరలించే కాల్వలను ఏపీ పటిష్టం చేస్తున్నా పట్టించుకోలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టులో తెలంగాణ వచ్చిన తర్వాత తట్టెడు మట్టి కూడా తీయలేదు.