సిద్దిపేట, వెలుగు : రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి నీటి పంపింగ్ ను గురువారం అధికారులు ప్రారంభించారు. సిద్దిపేట నియోజకవర్గ రైతుల యాసంగి పంటలకు రంగనాయక సాగర్ కాల్వల ద్వారా నీటిని అందించాలని మాజీ మంత్రి హరీశ్రావు ఇరిగేషన్ మంత్రికి లేఖ రాయడంతో పాటు ఫోన్ ద్వారా కోరారు. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి వచ్చిన నీటిని రంగనాయక సాగర్ లోకి రెండు పంపుల ద్వారా పంపింగ్ ప్రారంభించారు.
రంగనాయక సాగర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం మూడు టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు టీఎంసీల నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఇవ్వాలని కోరాగానే అధికారులతో చర్చించి నీటి పంపింగ్ ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రైతుల పక్షాన మాజీ మంత్రి హరీశ్రావు ధన్యవాదాలు తెలిపారు.