రూ. 3 వేల కోట్లతో శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేస్తున్నం..వనపర్తి జిల్లాలో కర్నెతండా లిఫ్ట్ ప్రారంభం

రూ. 3 వేల కోట్లతో శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేస్తున్నం..వనపర్తి జిల్లాలో కర్నెతండా లిఫ్ట్ ప్రారంభం
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • జూపల్లి కృష్ణారావుతో కలిసి వనపర్తి జిల్లాలో కర్నెతండా లిఫ్ట్ ప్రారంభం

వనపర్తి/ఖిల్లాగణపురం/అచ్చంపేట, వెలుగు : రూ. 3 వేల కోట్లు ఖర్చు చేసి శ్రీశైలం సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తున్నామని మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఖిల్లాగణపురం మండలం కర్నెతండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను , అచ్చంపేట నియోజకవర్గంలో హ్యామ్ రోడ్డు పనులను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ  ప్రభుత్వానికి అన్ని ప్రాంతాలు సమానమేనన్నారు. మూడేండ్లలో కాళేశ్వరం కట్టామని చెబుతున్న బీఆర్​ఎస్​నాయకులు కర్నెతండా ఎత్తిపోతలను ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ. 5 లక్షల చొప్పున ఇస్తోందని, దేశంలోని ఏ ప్రభుత్వమూ ఇండ్ల కోసం ఇలా ఖర్చు పెట్టడం లేదన్నారు. 

బీఆర్​ఎస్​పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తాము అధికారంలోకి రాగానే స్మార్ట్​రేషన్​కార్డులు ఇస్తున్నామని చెప్పారు. వనపర్తిని ఎమ్మెల్యే మేఘారెడ్డి వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలుస్తారన్నారు. కర్నెతండా లిఫ్ట్ కు గిరిజనుల ఆరాధ్యదైవమని సంత్​సేవాలాల్​పేరును పెట్టేలా జీవో తీసుకొస్తామని చెప్పారు.

 నల్లమల ప్రాంతంలో 146.71 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, రాజేశ్​రెడ్డి, కలెక్టర్లు ఆదర్శ్​ సురభి, హేమంత్ కేశవ్ పాటిల్, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో యాదయ్య, వనపర్తి, పెబ్బేరు మున్సిపల్​చైర్మన్లు మాధవి, శ్రీనివాస్​గౌడ్, సర్పంచ్ పూల్యానాయక్ పాల్గొన్నారు. 

అప్పులున్నా ఏ పథకాన్నీ ఎత్తేయలేదు : జూపల్లి కృష్ణారావు

బీఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని, అయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏ పథకాన్నీ ఎత్తేయకుండా కొనసాగిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. పిల్లలు మంచిగా చదువుకొని భవిష్యత్ లో స్థిరపడేలా తల్లిదండ్రులు చూసుకోవాలని చెప్పారు.