జవహర్నగర్, వెలుగు: మామను సుత్తితో తలపై కొట్టి అల్లుడు హత్య చేశాడు. కాప్రా మండలం జవహర్నగర్ దొండతోట సాయిబాబా కాలనీకి చెందిన మొగిలి(44), అండాలు దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉండగా, అందరికీ వివాహాలు జరిగాయి. ఈ నెల 23న దొండతోటలోని పెద్ద కుమార్తె ఇంట్లో జరిగిన బోనాల పండుగకు మొగిలి, అండాలు హాజరయ్యారు.
సాయంత్రం బయటకు వెళ్లిన మొగిలి ముఖంపై గాయాలతో తిరిగి వచ్చాడు. అనంతరం అల్లుడు శివతో గొడవ పెట్టుకున్నాడు. మొగిలి కిటికీలను ధ్వంసం చేసి, విద్యుత్ వైర్ను తొలగించడమే కాకుండా శివ బైక్ను ధ్వంసం చేశాడు.
కోపోద్రిక్తుడైన శివ సుత్తితో మామ మొగిలి తలపై రెండుసార్లు బలంగా కొట్టాడు. దీంతో మొగిలి అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని మొగిలిని పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటన అనంతరం శివ పరారయ్యాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
