- మత్తు మందు ఓవర్ డోస్ ఇంజక్షన్ తీసుకొని సూసైడ్
- సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఘటన
- ప్రేమ పెళ్లికి నిరాకరించడంతో గత జనవరిలో పేరెంట్స్ హత్య
వికారాబాద్, వెలుగు: ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంతో తల్లిదండ్రులకు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసిన కేసులో నిందితురాలు నక్కల సురేఖ సూసైడ్ చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ హాస్టల్లో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథం, నక్కలి లక్ష్మి కూతరు సురేఖ హస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలకున్నారు.
ఇదే విషయాన్ని సురేఖ తన తల్లిద్రండులకు చెప్పింది. వారు ఈ పెళ్లికి నిరాకరించారు. దీంతో వారిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న సురేఖ.. హాస్పిటల్ నుంచి మత్తు మందును తెచ్చుకుంది. ఈ ఏడాది జనవరి 24న ఇంజక్షన్ సహాయంతో మత్తు మందును ఓవర్ డోస్ ఇచ్చి హత్య చేసింది. ఆ తర్వాత తనకు ఏమీ తెలియనట్లు తన అన్నకు ఫోన్ చేసి, అమ్మనాన్న ఇద్దరు కింద పడిపోయారని చెప్పింది. పోలీసులు కేసు దర్యాప్తు చేయగా, ఇంట్లో ఇంజక్షన్ సిరంజీలు బయటపడటంతో సురేఖపై కేసు ఫైల్ అయింది. జనవరి 28వ తేదీన అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల సురేఖ బెయిల్పై జైలు నుంచి బయటికిరాగా, కుటుంబ సభ్యులు ఆమెను దగ్గరకు రానివ్వలేదు. దీంతో సంగారెడ్డిలో ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ నర్సుగా మళ్లీ పని చేయడం మొదలుపెట్టింది. తాజాగా ఆదివారం రాత్రి తాను ఉంటున్న హాస్టల్లోనే ఓవర్ డోస్ మత్తు మందు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
