- హైదరాబాద్ నుంచి బైక్ పై బయలుదేరిన కొడుకు, కోడలు, అల్లుడు
- విధులకు వెళ్తూ మార్గమధ్యలో అకస్మాత్తుగా చనిపోయిన మహిళ
- డిండి సమీపంలో బైక్ ను ఢీకొట్టిన కారు
లింగాల, వెలుగు : అత్త అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వస్తుండగా జరిగిన ప్రమాదంలో మృతురాలి కోడలు, అల్లుడు చనిపోయారు. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా డిండి సమీపంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన లలిత అదే గ్రామంలో అంగన్ వాడీ టీచర్ గా పనిచేస్తోంది. అచ్చంపేటలో నివాసం ఉంటున్న ఆమె సోమవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు అచ్చంపేట బస్టాండ్కు చేరుకుంది.
కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడంతో అక్కడే కూర్చొని అకస్మాత్తుగా చనిపోయింది. లలిత మృతి చెందిన విషయం తెలియడంతో హైదరాబాద్లో ఉంటున్న ఆమె కుమారుడు శ్రీకాంత్, కోడలు చంద్రకళ, అల్లుడు నాగరాజు కలిసి బైక్ పై అచ్చంపేటకు బయలుదేరారు.
నల్గొండ జిల్లా డిండి సమీపంలోకి రాగానే అచ్చంపేట నుంచి వస్తున్న కారు బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో చంద్రకళ, నాగరాజు అక్కడికక్కడే చనిపోగా, శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన శ్రీకాంత్ ను హాస్పిటల్ కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
