తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం సామాన్యుల దగ్గర జలగల్లా పట్టి పీడిస్తున్న అవినీతి తిమింగలాల ఆటకట్టిస్తోంది. పక్కా సమాచారంతో నిఘా వేసి లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులను కటకటాల్లోకి నెడుతోంది.
లేటెస్ట్ గా ఇవాళ ఆగస్టు 24న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ అడ్డంగా చిక్కారు ఆర్ఐ పూర్ణ చందర్ రావు, జీపీవో అహ్మద్.
భూమి పౌతి కోసం రూ.20 వేల లంచం డిమాండ్ చేశారు జీపీవో, ఆర్ఐ. అయితే లంచం ఇవ్వలేనని చెప్పడంతో బాధితుడిపై ఒత్తిడి చేశారు. దీంతో లంచం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు బుడిగ మహేష్. రెండు రోజులుగా నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో రూ. 14 వేలు తీసుకుంటుండగా జీపీఓ, ఆర్ఐలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
