ఇబ్రహీంపట్నం, వెలుగు: బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడి మొబైల్ ఫోన్ను చోరీ చేసి, ఆయన బ్యాంక్ ఖాతా నుంచి రూ.1,09,926 అక్రమంగా విత్డ్రా చేశారు. హైదరాబాద్ రాంకోటి ప్రాంతానికి చెందిన కె.బాల్రాజ్(71) ఈ నెల 14న ఉదయం 8 గంటలకు బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఎంజీబీఎస్ బస్స్టాండ్ నుంచి నల్గొండ వెళ్లే బస్సు ఎక్కారు.
బస్సు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్స్టాప్ వద్దకు చేరుకునే సమయానికి చొక్కా జేబులో పెట్టుకున్న ఒప్పో మొబైల్ కనిపించలేదు. అంత్యక్రియలకు వెళ్లాల్సి ఉండటంతో ఆ రోజు సిమ్ను బ్లాక్ చేయలేకపోయారు. మరుసటి రోజు ఆగస్టు 15న పాత నంబర్కు సంబంధించిన సిమ్ను బ్లాక్ చేయించి కొత్త సిమ్ తీసుకున్నారు.
సిమ్ యాక్టివేట్ అయిన వెంటనే యూనియన్ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు వరుసగా మెసేజ్లు వచ్చాయి. దీంతో నారాయణగూడలోని తన హోమ్ బ్రాంచ్కు వెళ్లి ఖాతా స్టేట్మెంట్ తీసుకోగా, గుర్తుతెలియని వ్యక్తులు రూ.1,09,926లను అనధికారిక లావాదేవీల ద్వారా కాజేసినట్లు గుర్తించారు. దీనిపై 1930 సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. అనంతరం సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు
