ఎన్నికలను నియంత్రించే అధికారం తమది కాదని, రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం పనితీరును నిర్దేశించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లలో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్లతో సరిపోల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
వాస్తవానికి దీనిపై ధర్మాసనం నేడు తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే, ఈ అంశంలో ఇంకా తమకు సందేహాలు ఉండటంతో ధర్మాసనం స్పష్టత కోరింది. ఈక్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు సంధించింది.
వీటికి ఈ మధ్యాహ్నం 2 గంటల్లోగా సమాధానాలను ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం విచారణను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. మొత్తం వీవీప్యాట్ల లెక్కింపుపై తమ అభిప్రాయాలను తెలియజేయాలంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను సూచించింది.
Also Read:ఒడిశా రాజకీయాల్లో లుంగీ పంచాయతీ.. సీఎం లుంగీపై బీజేడీ, బీజేపీ మాటల యుద్ధం
అయిదు ప్రశ్నలు ఇవే
- మైక్రో కంట్రోలర్ను ఈవీఎం కంట్రోల్ యూనిట్లో అమర్చారా? లేక వీవీప్యాట్లల్లో ఇన్స్టాల్ చేశారా? ఈసీ ఎఫ్ఏక్యూలో ఈ మైక్రో కంట్రోలర్ వీవీప్యాట్లల్లో ఇన్స్టాల్ చేసినట్లు సమాధానాలను ఇచ్చారు. దీనిపై వివరణ ఇవ్వాలి?
- ఈవీఎంలల్లో అమర్చిన ఈ మైక్రో కంట్రోలర్.. వన్ టైమ్ ప్రోగ్రామబుల్ యూనిట్టా? కాదా?
- ఎన్ని ఎన్నికల గుర్తులను లోడింగ్ చేయగల యూనిట్లు అందుబాటులో ఉన్నాయి?
- ఎన్నికల పిటీషన్లను నిల్వ ఉంచడానికి 45 రోజులు, వాటిని దాఖలు చేయడానికి అవసరమైన లిమిటేషన్ పీరియడ్ను 30 రోజులుగా పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 81 ప్రకారం.. లిమిటేషన్ పీరియడ్ 45 రోజులుగా ఉండాలి. దీనిపై వివరణ ఇవ్వాలి?
- ఈవీఎంల భద్రతలో భాగంగా దాని కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లను కూడా సీల్ చేయవచ్చా?