
పీఏసీ మీటింగ్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన సన్నాహాలను అడిగి తెలుసుకున్నారు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్. మంగళవారం (జూన్ 24) గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో.. ఉప ఎన్నికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఉప ఎన్నికలో కచ్చితంగా గెలవాల్సిందేనని ఆమె సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం గ్రేటర్ పరిధిలోని నాయకులందర్నీ సమన్వయం చేయాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు బాధ్యతలు అప్పగించారు.
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కు ఎవరిని నియమిస్తున్నారని అడిగిన ప్రశ్నకు.. ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదని సీఎం రేవంత్ చెప్పారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఎంపికపై ఎవరూ మాట్లాడకూడదని ఆదేశించారు. పార్టీ నిర్ణయించి అభ్యర్థిని ప్రకటించే వరకు ఎవరూ కామెంట్స్ చేయొద్దని సూచించారు.
పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని హెచ్చరించారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా తమ సేవలను ఉపయోగించుకోవాలని పలువురు సీనియర్లు తెలిపారు. అయితే పదవులు వచ్చిన వాళ్ళు రాష్ట్రమంతా తిరిగి పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు సీఎం.
పీఏసీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హాట్ హాట్ గా చర్చ జరిగింది. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రులు కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో తమపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. ప్రతి చిన్న పనికి మంత్రుల వద్దకు రావడంతో పని భారం పెరుగుతుందని తెలిపారు. వీలైనంత త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దామని.. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు మంత్రులు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు.