న్యూఢిల్లీ: ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే ఎంత పెద్ద ఎయిర్లైన్స్సంస్థ అయినా సరే ఉపేక్షించబోమని సివిల్ ఏవియేషన్ మినిస్టర్రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రయాణ షెడ్యూల్లో భారీ వైఫల్యాలకు ఇండిగోనే బాధ్యత వహిస్తుందని చెప్పారు. మంగళవారం లోక్సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఇండిగో యాజమాన్యానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షోకాజ్ నోటీసులు ఇచ్చిందని, దర్యాప్తు కూడా ప్రారంభమైందని చెప్పారు. దర్యాప్తులో వెల్లడైన వివరాల ఆధారంగా ముందుకెళ్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన ఇండిగోపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని అన్నారు.
కొత్త ఎయిర్లైన్స్ను ప్రోత్సహిస్తం
పౌర విమానయానంలో భద్రత అత్యంత కీలకమని, దానిపై రాజీ పడబోమని రామ్మోహన్ నాయుడు తెలిపారు. డీజీసీఏ సవరించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ను పాటించేందుకు ఇండిగో హామీ ఇచ్చిందని, అయినప్పటికీ అంతర్గత రోస్టరింగ్ సమస్యల వల్ల వేలాది మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగిందని అన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ప్రజాప్రయోజనాలకే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ సర్వీసుల రద్దు వేళ విమాన టికెట్ చార్జీలపై పరిమితులు విధించామని తెలిపారు. విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి తాము తావివ్వడం లేదని, మరిన్ని ఎయిర్లైన్స్ను ఇందులోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

