IPL 2025: వేదికగా గురించి ఆలోచించట్లే.. కోహ్లీ కోసమైనా IPL టైటిల్ సాధిస్తాం: పటిదార్

IPL 2025: వేదికగా గురించి ఆలోచించట్లే.. కోహ్లీ కోసమైనా IPL టైటిల్ సాధిస్తాం: పటిదార్

గాంధీనగర్: ఐపీఎల్ 2025 సీజన్ మరొక్క మ్యాచ్‎తో ముగియనుంది. 2025, జూన్ 3న గుజరాత్‎లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా ఫైనల్ పోరు జరగనుంది. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఫైనల్ పోరులో టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ క్రమంలో సోమవారం (జూన్ 2) జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ఆర్సీబీ జట్టు కోసం 18 సంవత్సరాలుగా కోహ్లీ ఎన్నో చేశాడు. వేల పరుగులు, లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. 

కానీ దురదృష్టవశాత్తూ ఆర్సీబీ టైటిల్ సాధించలేదు. ఈ సారి విరాట్ కోహ్లీ కోసమైనా టైటిల్ గెలుచుకోవడానికి మేం శాయశక్తులా ప్రయత్నిస్తాం’’ అని పటిదార్ తన సహచర ఆటగాడికి కప్ అందించాలనే కోరికను బయటపెట్టాడు. ఒక్క బెంగుళూరులోనే కాకుండా.. ఎక్కడ ఆడిన కూడా మాకు హోం గ్రౌండ్‎లో ఆడినట్లే ఉందని.. ప్రేక్షకులు మమ్మల్ని ఆ విధంగా ఆదరిస్తున్నారని అన్నారు. ఇక, ఫైనల్ మ్యాచ్ జరిగే వేదిక గురించి మేం ఎక్కువగా ఆలోచించడం లేదని.. ఎక్కడైనా మేము మా ఉత్తమ క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తామన్నారు. 

ఆర్సీబీ లాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టుకు కెప్టెన్‎గా వ్యవహరించడం తనకు నేర్చుకోవడానికి గొప్ప అనుభవమని అన్నారు. ఎప్పుడూ జట్టులో ప్రశాంత వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టి పెట్టాతానని చెప్పారు. ఇక, స్టార్ ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్‎ను సోమవారం (జూన్ 2) వైద్యులు పరిశీలించి రిపోర్ట్ ఇస్తారని.. దాని ఆధారంగా అతడిని ఫైనల్ మ్యాచ్ ఆడించాలా లేదా అని నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. 

కాగా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రారంభం నుంచి (18 సీజన్లు) ఇప్పటి వరకు ఆర్సీబీ తరుపునే ఆడుతున్నాడు. ఆర్సీబీ తరుఫున ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కోహ్లీనే. ఐపీఎల్‎లో ఆర్సీబీ ఇప్పటి వరకు 4 సార్లు ఫైనల్స్‎కు వెళ్లింది. 2009, 2011, 2016 మూడు సీజన్లు ఫైనల్‎కు వెళ్లిన తుదిపోరులో మాత్రం నిరాశే ఎదురైంది. ఈ సారైనా టైటిల్ గెలిచి అభిమానులతో పాటు కోహ్లీ 18 ఏళ్ల కలను సాకారం చేయాలని ఆర్సీబీ జట్టు పట్టుదలతో ఉంది.