- లోటు నుంచి మిగులుకు వర్షపాతం
- హైదరాబాద్, వికారాబాద్ మినహా అంతటా వానలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానలు జోరందుకున్నాయి. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా దంచికొడుతున్నాయి. లోటు వర్షపాతం నుంచి మిగులుకు చేరుకుంది. పలు జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. టీఎస్డీపీఎస్ డేటా ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొత్తపల్లెగోరిలో 11 సెంటీమీటర్లు, మంచిర్యాలలోని తాండూరులో 8.4, మెదక్లోని నాగాపూర్, ములుగులోని మల్లంపల్లిలో 8.3, భద్రాద్రి కొత్తగూడెంలోని ఇ.భయ్యారం, కామారెడ్డిలోని అర్గొండలో 8.2, ములుగులోని వాజీడులో 7.8, నల్గొండలోని అయిటిపాములలో 7.3 సె.మీ. చొప్పున వర్షపాతం రికార్డయ్యింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
సగటున 10 సెం.మీ వర్షపాతం
రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. అప్పటి నుంచి ప్రతి రోజూ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయినా లోటు వర్షపాతం నమోదైంది. కానీ ఆదివారం నాటికి రాష్ట్రంలో మిగులు వర్షపాతం రికార్డయ్యింది. సగటున 10 సెం.మీ. వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయగా, 12.9 సెం.మీ.లుగా రికార్డయ్యింది. రాష్ట్రంలో 2 జిల్లాలు మినహా అంతటా నార్మల్, మిగులు వర్షపాతం ఉంది. కరీంనగర్, జనగామ జిల్లాల్లో లార్జ్ ఎక్సెస్ రెయిన్ఫాల్ రికార్డయ్యింది. హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది.