- బంధుగణానికి మాస్కులు, శానిటైజర్లూ
- సోషల్ డిస్టెన్స్పై అనౌన్స్మెంట్లు
- మండపంపైకి కుటుంబ సభ్యులకే అనుమతి
- రూ.3 లక్షలకు తగ్గిన ఖర్చులు
హైదరాబాద్, వెలుగు: పెండ్లి.. జీవితంలో ఒక్కసారి వచ్చే తంతు. అలాంటి పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని కుర్రాళ్లు, ‘పెళ్లంటే ఇట్ల చెయ్యాల్రా’ అంటూ పది మంది చెప్పుకోవాలని వాళ్ల తల్లిదండ్రులు ఆరాటపడిపోతరు. ఆకాశమంతా పందిరేసి.. వందలాది మందిని పిలిచి అంబరాన్నంటేలా చేయాలనుకుంటరు. కానీ, కరోనా టైంలో ఆ కల్యాణ గడియలు వస్తే..! మొత్తం రివర్స్! రూల్సన్నీ చేంజ్! ఆడంబరంగా జరగాల్సిన పెళ్లిళ్లు సింపుల్గా జరిగిపోతాయి. కేంద్ర సర్కార్ అలాంటి రూల్సే పెట్టింది. అమ్మాయి, అబ్బాయి తరఫున25 మంది చొప్పున 50 మంది గెస్టులకే పరిమితి పెట్టింది. అయినా డోంట్ వర్రీ అంటున్నారు వెడ్డింగ్ ప్లానర్లు. దగ్గరుండి ఉన్నంతలో భద్రంగా, గ్రాండ్గా పెళ్లి చేయిస్తామంటున్నారు. గెస్టులకు పన్నీరు చల్లడం కాదు.. శానిటైజేషన్ టన్నెల్స్ పెడతామంటున్నారు. మాస్కులు, గ్లోవ్స్ తామే ఇస్తామంటున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు దూరం దూరంగా టేబుల్స్ వేస్తామంటున్నారు. అవసరమైతే యాంకర్లను పెట్టి అనౌన్స్ చేయిస్తామని చెబుతున్నారు. డెకరేషన్ నుంచి పోలీస్ పర్మిషన్ వరకూ అన్నీ దగ్గరుండి చూసుకుంటామంటున్నారు. దానికి తగ్గట్టు ప్యాకేజీల్లో మార్పులూ చేస్తున్నారు. ప్యాకేజీలో భాగంగా అతిథులకు ఈ–ఇన్విటేషన్ పంపడం, బ్రైడల్ మేకప్, మెహంది ఆర్టిస్ట్, ఫొటో బూత్, కార్ డెకరేషన్, మండపం, సన్నాయి మేళం, ఫుడ్, ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్ వంటి వాటితో పాటు వచ్చిన గెస్టులకు థర్మల్ స్క్రీనింగ్ చేయడం, యూవీ హ్యాండ్ శానిటైజేషన్, మాస్కులివ్వడం వంటి వాటినీ మేనేజ్ చేస్తున్నారు. మండపం డెకరేషన్కు వచ్చే లేబర్, ఫొటోగ్రాఫర్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సోషల్ డిస్టెన్స్ ఉండేలా
పెళ్లయినా వేరే ఫంక్షన్ ఏదైనా ఫుడ్కు చాలా మంది ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ విషయంలోనూ వెడ్డింగ్ ప్లానర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యాటరింగ్ దగ్గర బాయ్స్ ఉండకుండా మెనూకు తగ్గట్టు ఫుడ్ను బాక్సుల్లో ప్యాక్ చేసి పెడుతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించేలా గెస్టుల కోసం 6 అడుగుల దూరంతో రౌండ్ టేబుల్స్ వేస్తున్నారు. అందరూ గుంపులుగా ఉండకుండా యాంకర్ను పెట్టి ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా అరగంటకొకసారి అనౌన్స్ చేయిస్తున్నారు. ప్రతి గెస్ట్ అరగంటకొకసారి చేతులను కడుక్కునేలా చూస్తున్నారు. పెళ్లి మండపంలో కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్లు ఉండకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎంత మంది గెస్టులొచ్చారన్నదానిని ఎప్పటికప్పుడు ఎక్సెల్ షీట్లో మెయింటెయిన్ చేస్తున్నారు.
వాటి ఖర్చు తక్కువే
కరోనా కారణంగా ప్యాకేజీలో చేర్చిన సేఫ్టీ ప్రికాషన్స్ ఖర్చు తక్కువేనంటున్నారు వెడ్డింగ్ ప్లానర్లు. మెడికల్, సేఫ్టీ మెజర్స్ ఐటమ్స్ను కొన్ని ఏజెన్సీల ద్వారా తెప్పించుకుంటున్నారు. వారికి ఆర్డర్ ఇస్తే శానిటైజేషన్ స్టాండ్, 50 మాస్కులు, 50 జతల గ్లోవ్స్ రూ.15 వేలల్లో వచ్చేస్తున్నాయని చెబుతున్నారు. దాంతో పాటు పెళ్లి జరిగే ప్లేస్ మొత్తాన్ని శానిటైజ్ చేసి వెళ్తున్నారని వెడ్డింగ్ ప్లానర్లు చెబుతున్నారు. వెడ్డింగ్ ప్లానర్ల చెబుతున్న దాని ప్రకారం.. పెళ్లి ఖర్చు కూడా చాలా వరకు తగ్గింది. ఒకప్పుడు 25 లక్షల దాకా చార్జ్ చేస్తే ఇప్పుడు రూ.3 లక్షలకు తగ్గిందంటున్నారు.
ఖర్చు 3 లక్షలకు తగ్గిపోయింది
లాక్డౌన్ మొదలైన వారం నుంచే ప్యాకేజీల్లో మార్పులు చేశాం. ఇప్పటిదాకా 10కి పైగా ఈవెంట్స్ చేశాం. ఒకప్పుడు పెళ్లికి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్యాకేజీ ఉండేది. ఇప్పుడు రూ.3 లక్షలకు తగ్గిపోయింది. తక్కువ మంది అతిథులతోనే పెళ్లిళ్లు అవుతున్నాయి. పెళ్లికి ముందే పోలీసుల పర్మిషన్ తీసుకుంటున్నాం. పెళ్లి జరిగే టైంలో డ్యూటీ ఆఫీసర్ వచ్చి చెక్ చేసి వెళ్తారు. యాంకర్ ద్వారా అరగంటకోసారి సేఫ్టీ ప్రికాషన్స్ గురించి అనౌన్స్ చేయిస్తున్నాం. ఫుడ్ కూడా సెల్ఫ్ సర్వీస్. అన్నింటినీ బాక్సుల్లో ప్యాక్ చేస్తున్నాం.
– అరుణ్ కుమార్, వెడ్డింగ్ ప్లానర్, వజ్ర ఈవెంట్స్