మూసీ ప్రక్షాళన చర్చ సందర్భంగా అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడిచింది..అసలేం జరిగిందంటే.. మూసీలో కాలుష్యం కంటే కొంతమంది కడుపులో విషమే ఎక్కవని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు.
కడుపులో విషం అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభ్యంతరం తెలిపారు. కడుపులో విషమని బీఆర్ఎస్ నేతలను తిట్టడమేంటని ప్రశ్నించారు. వెంటనే కల్గజేసుకున్న మంత్రి శ్రీధర్ బాబు..సీఎం ఎవర్ని వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. అనంతరం మాట్లాడిన హరీశ్ రావు.. మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపే ఎక్కువని వ్యాఖ్యానించారు. సభలో తమ క్కులను కాలరాస్తున్నారని అన్నారు. సభలో కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు.
అయితే సీఎంపై హరీశ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. లేదంటే రికార్డులను తొలగించాలన్నారు. సీఎం అంటే హరీశ్ రావుకు ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు. అనంతరం రైతుల యూరియా సమస్యపై బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు స్పీకర్. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
