రైతు భరోసా ప్రారంభానికి ప్రధాని మోడీకి ఆహ్వానం

రైతు భరోసా ప్రారంభానికి ప్రధాని మోడీకి ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోమోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అమలు చేయనున్న పథకాల యాక్షన్‌ ప్లాన్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు పథకాల అమలుకు సంబంధించిన షెడ్యూల్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జగన్ వివరించారు. అక్టోబరు 15న రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమ ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించామన్నారు. దేశంమొత్తం ఈ కార్యక్రమాల వైపు చూడాలని సీఎం సూచించారు. ఎక్కడా పొరపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని స్పష్టం చేశారు.

గ్రామ సచివాలయమే కౌలు రైతులకు కార్డులు ఇస్తుందని తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి. 11 నెలల కాలానికి ఇది వర్తిస్తుందన్నారు. రైతులకు ఎలాంటి నష్టం రాకుండా, భూమిపై తమకున్న హక్కులకు భంగం వాటిల్లకుండా కేవలం పంటపైన మాత్రమే 11 నెలలపాటు కౌలు రైతుకు హక్కు లభిస్తుందని తెలిపారు. కౌలు రైతులకు కార్డులు అందగానే వాళ్లు రైతు భరోసాకు అర్హులవుతారని చెప్పారు. ఈ సారికి మాత్రమే రైతు భరోసా రబీకి ఇస్తున్నామని..  వచ్చే ఏడాది నుంచి మేలో ఇస్తామన్నారు. తద్వారా ఖరీఫ్‌లో రైతులకు బాసటగా ఉంటామని  స్పష్టం చేశారు సీఎం జగన్.