దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..40 శాతం వైకల్యం ఉన్నా పరికరాలిస్తం: ముత్తినేని వీరయ్య

దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..40 శాతం వైకల్యం ఉన్నా పరికరాలిస్తం: ముత్తినేని వీరయ్య

హైదరాబాద్, వెలుగు: దివ్యాంగుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని , ఇందులో భాగంగా 40 శాతం వైకల్యం ఉన్నా పరికరాలు ఇచ్చే జీవో ఇటీవల ప్రభుత్వం జారీచేసిందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. శుక్రవారం మలక్ పేటలోని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ & దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ ల సంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో 10 వికలాంగుల సంఘాలు చైర్మన్ వీరయ్యను సన్మానించాయి. 40 శాతం వైకల్యం ఉన్నా పరికరాలు ఇవ్వనున్నట్లు జారీ చేసిన జీవో దేశ చరిత్రలోనే మొట్ట మొదటిదన్నారు.

దివ్యాంగులని దివ్యాంగులు పెండ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు అదనంగా మరో రూ. లక్ష  ప్రోత్సాహం ఇస్తూ జీవో ఇవ్వడంపై సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. దివ్యాంగుల పట్ల బాధ్యతతోనే సీఎం ఈ 2 జీవోలు ఇచ్చారని చైర్మన్ వీరయ్య గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని నిర్ణయాలు తీసుకుటామన్నారు. ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ ( నేషనల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది డిసబుల్డ్)   జాతీయ అధ్యక్షుడు తుడుం రాజేందర్ మాట్లాడుతూ.. వీరయ్య గడిచిన పదేండ్లలో దివ్యాంగుల కోసం అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు.

ఆయనను కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం మంచి నిర్ణయమన్నారు. స్పైనల్ కార్డ్ ఇంజురీ రాష్ట్ర అధ్యక్షుడు షఫీ మాట్లాడుతూ.. వీరయ్య100 మంది దివ్యాంగులకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించారన్నారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర   అధ్యక్షుడు మల్లికార్జున్, స్టేట్ జనరల్ సెక్రటరీ బెస్త యాదగిరి తదితరులు పాల్గొన్నారు.