
కార్పొరేట్ ఆస్పత్రులకు సమానంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నామని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. ఎక్స్ ఫర్ట్ డాక్టర్లు..మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే అదంతా మాటలకే పరిమితమని విజయవాడ ప్రభుత్వాసుపత్రి డాక్టర్ల పనితీరు చూస్తే తెలుస్తోంది. కాలికి గాయమైందని వైద్యం కోసం వెళితే చేయి పనిచేయకుండా చేశారు.
రాజు అనే వ్యక్తి విజయవాడలో స్థానికంగా ఉన్న షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం అతడు బైక్ పై నుంచి పడటంతో కాలికి గాయమైంది. దీంతో అతడు విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళాడు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కాలికి కుట్లు వేసి రెండు ఇంజక్షన్లు ఇచ్చారు. ఎడమ చేయి పనిచేయకపోవడం గమనించిన వారు కట్టు కట్టి పంపించేశారు. చేయి నొప్పి ఎక్కువ కావడంతో రాజు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. చేతి కండరానికి చేసే ఇంజెక్షన్ కాస్త.. నరానికి తగిలినట్టు గుర్తించారు డాక్టర్లు. దీనికి ఆపరేషన్ చేస్తే గుండెకు అపాయం జరిగే అవకాశముందని కట్టు కట్టి పంపించినట్టు చెప్పారు.
తనకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రాజు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాడు.