న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని ఇండియన్ ఎంబసీలు అలర్ట్ అయ్యాయి. ఆయా దేశాల్లోని ఇండియన్లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ అడ్వైజరీలు జారీ చేశాయి. అనవసర ప్రయాణాలు చేయొద్దని హెచ్చరించాయి. "ఇజ్రాయెల్లోని భారత పౌరులు ఆ దేశ అధికారులు జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి.
పౌరుల భద్రత కోసం ఏర్పాటు చేసిన షెల్టర్లకు సమీపంలో ఉంటూ హెచ్చరికలు జారీ అయితే వెంటనే అక్కడికి చేరుకునేందుకు సిద్ధంగా ఉండాలి. తదుపరి నోటీసులు వచ్చే వరకు అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు. అధికారిక ప్రకటనలను, ఎమర్జెన్సీ అలర్ట్లను నిరంతరం గమనించండి. సాయం అవసరమైన ఇండియన్ల కోసం 24x7 ఎమర్జెన్సీ హెల్ప్లైన్ ప్రారంభించాం. ఇజ్రాయెల్ అధికారులతో భారత రాయబార కార్యాలయం టచ్ లో ఉంది" అని టెల్ అవీవ్లోని భారత ఎంబసీ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ఇరాన్ లోని ఇండియన్లను ఉద్దేశించి టెహ్రాన్లోని భారత ఎంబసీ కూడా అడ్వైజరీ జారీ చేసింది. యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, పాలస్తీనా, బహ్రెయిన్ వంటి గల్ఫ్ కంట్రీస్ లోని ఇండియన్లకు కూడా ఆయా దేశాల్లోని భారత ఎంబసీలు ఇదే విధంగా అడ్వైజరీ జారీ చేశాయి. భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులు ఇచ్చే భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కోరాయి.
