- బెంగాలీలకు అమిత్ షా పిలుపు
కోల్కతా: బెంగాల్లో పోలింగ్ అనంతరం కేంద్ర బలగాలు మరో 60 రోజులు రాష్ట్రంలోనే కొనసాగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. చివరి దశ పోలింగ్లో ప్రజలు భయపడకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దీదీ గూండాల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
సోమవారం బెహాలాలో నిర్వహించిన రోడ్షో తర్వాత జరిగిన సభలో అమిత్ షా మాట్లాడారు. ఎన్నికల సంఘం రాష్ట్రంలోని ప్రతి మూలలో కేంద్ర బలగాలను మోహరించిందని చెప్పారు. ఏప్రిల్ 29 న జరిగే రెండో, తుది దశ పోలింగ్లో ప్రజలు నిర్భయంగా ఓటేయాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీకి బలమైన అనుకూల వాతావరణం ఉందని అన్నారు.
అధికారంలోకి వచ్చాక బెంగాల్లో అక్రమ చొరబాటుదారులను ఏరివేస్తామన్నారు. రాజకీయ హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మమతా బెనర్జీ అక్రమ వలసదారులను రక్షిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు.

