
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఇండియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో వెస్టిండీస్ పోరాడుతోంది. క్రెయిగ్ బ్రాత్వైట్ (75) హాఫ్ సెంచరీతో రాణించడంతో.. శనివారం రెండో రోజు 86/1 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన వెస్టిండీస్ టీ బ్రేక్ టైమ్కు 86 ఓవర్లలో 174/3 స్కోరు చేసింది. బ్లాక్వుడ్ (16 బ్యాటింగ్), అథనాజే (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కరీబియన్ టీమ్ ఇంకా 264 రన్స్ వెనకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్లో ఇండియా 438 రన్స్ చేసింది.
తొలి సెషన్లో పిచ్ పేసర్లకు, స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించలేదు. దీంతో ఉనాద్కట్, సిరాజ్ లైన్ అండ్ లెంగ్త్ కుదరక కాస్త ఇబ్బందిపడ్డారు. అయితే వర్షం వల్ల కేవలం 10 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన ఈ సెషన్లో కొత్త బౌలర్ ముకేశ్ కుమార్ కెరీర్లో తొలి వికెట్ సాధించాడు. ఓ ఎండ్లో బ్రాత్వైట్ డిఫెన్స్తో నిలబడినా.. రెండో ఎండ్లో కిర్క్ మెకంజీ (32) షాట్లు కొట్టే సాహసం చేశాడు. కానీ 52వ ఓవర్లో ముకేశ్ వేసిన షార్ట్ బాల్ను కట్ చేసే ప్రయత్నంలో కీపర్ ఇషాన్ కిషన్కు చిక్కాడు. దీంతో రెండో వికెట్కు 46 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఈ దశలో వర్షం రావడంతో అంపైర్లు తొందరగా లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ తర్వాత బ్రాత్వైట్ మరింత నిలకడగా ఆడాడు. బ్లాక్వుడ్ కూడా డిఫెన్స్కే పరిమితమయ్యాడు. దాదాపు 20 ఓవర్ల పాటు క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీ మధ్యలో ఒకటి, రెండు సింగిల్స్ మాత్రమే తీసింది. అయితే వీళ్లను విడదీసేందుకు అశ్విన్–జడ్డూ కాంబినేషన్ను ప్రయోగించిన రోహిత్ సక్సెస్ అయ్యాడు. ఇన్నింగ్స్ 73వ ఓవర్లో అశ్విన్ వేసిన బాల్ను డిఫెన్స్ చేసే క్రమంలో బ్రాత్వైట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.