
తరౌబా (ట్రినిడాడ్ అండ్ టుబాగో): బ్యాటింగ్లో షాయ్ హోప్ (94 బాల్స్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 120 నాటౌట్), బౌలింగ్లో జేడెన్ సీల్స్ (6/18) దుమ్మురేపడంతో.. మంగళవారం అర్ధరాత్రి జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ 202 రన్స్ భారీ తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. దాంతో మూడు మ్యాచ్ల సిరీస్ను విండీస్ 2–1తో సొంతం చేసుకుంది. ఫలితంగా 1991 తర్వాత పాక్పై వన్డే సిరీస్ గెలవడం కరీబియన్ జట్టుకు ఇదే తొలిసారి.
టాస్ ఓడిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 294/6 స్కోరు చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (43 నాటౌట్), ఎవిన్ లూయిస్ (37), రోస్టన్ ఛేజ్ (36) మెరుగ్గా ఆడారు. నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఛేజింగ్లో పాకిస్తాన్ 29.2 ఓవర్లలో 92 రన్స్కే కుప్పకూలింది. సల్మాన్ ఆగా (30) టాప్ స్కోరర్. మహ్మద్ నవాజ్ (23 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. హోప్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, 10 వికెట్లు తీసిన సీల్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.