
పహల్గాంలో జరిగిన టెర్రర్ అటాక్లో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా పరిగణిస్తే.. 2008 ముంబై దాడుల తర్వాత కాశ్మీర్లో జరిగిన ఈ దాడి అత్యంత ఘోరమైన ఉగ్రదాడి. ఇది ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడికి చిన్నదిగా కనిపించిందా అనే ప్రశ్న సహజం. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్ 7 మే 2025న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి భారత్ సంయమనం నుంచి ఉగ్రవాద సమస్య పరిష్కార దిశగా మారడాన్ని ఆపరేషన్ సిందూర్ అంటున్నాం. అయినప్పటికీ, ప్రపంచ దేశాల నిరుత్సాహకరమైన ప్రతిస్పందన ఒక కలతపెట్టే సత్యాన్ని వెల్లడిస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం పశ్చిమ దేశాల భౌగోళిక రాజకీయాల ద్వారా బలహీనపడుతోంది. పాకిస్తాన్ను రక్షించడం, పాక్ను ప్రజాస్వామ్య భారతదేశంతో సమానం చేయడం గర్హనీయం. టెర్రరిజాన్ని ప్రోత్సహించేవారిని రక్షించినప్పుడు ఇక ఉగ్రవాదాన్ని ఎలా ఓడించగలం?
2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పునరుద్ధరించిన కాశ్మీర్లోని శాంతిపూరిత వాతావరణాన్ని అస్థిరపరిచేందుకు ఉద్దేశించిన ఒక కుట్రపూరిత చర్యనే పహల్గాం దాడి. కాశ్మీర్ పర్యాటక ఆధారిత ఆర్థికవ్యవస్థను నిర్వీర్యం చేయడం, టూరిస్టులను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా టీఆర్ఎఫ్ టెర్రరిస్టులు దాడి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రతిస్పందన పాకిస్తాన్ షాక్కు గురయ్యేలా వేగంగా జరిగింది. ఆపరేషన్ సిందూర్ నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. పాక్లో దాగిన ఉగ్రవాదులనూ టార్గెట్ చేసి కొంత ఫలితాలనూ సాధించింది కూడా. ఇది భారతదేశం గతంలో పాటించిన సంయమనం నుంచి వైదొలగడాన్ని సూచిస్తోంది. తీవ్రవాదం ఎక్కడున్నా దాన్ని నిర్మూలించాలని చెప్పే అమెరికా, పాశ్చాత్య దేశాలు, అదే విషయంలో భారత్కు అండగా నిలబడుతున్నాయా? భౌగోళిక రాజకీయాలు, స్వీయ ప్రయోజనాల కోసం తీవ్రవాదులపై యుద్ధం విషయం వచ్చేసరికి ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయి. ‘నాన్ ఎస్కలేటరీ’గా వర్ణించిన.. ఇండియన్ ఆర్మీ దాడులు పాకిస్తాన్ ప్రాక్సీ యుద్ధంపట్ల భారతదేశం ఇక ఏమాత్రం సంయమనం పాటించదని, తీవ్ర ప్రతిదాడులు తప్పవని సూచిస్తున్నాయి.
మరోవైపు దాయాది పాక్కు చెంపపెట్టులా భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేసింది, అటారీ- వాఘా సరిహద్దును మూసివేసింది. పాకిస్తాన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది. డాన్, జియో టీవీ మొదలైన పాకిస్తాన్ మీడియా సంస్థలను నిషేధించింది. భారత్ పాకిస్తాన్ను దౌత్యపరంగా, ఆర్థికంగా ఒంటరిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. పాకిస్తాన్ భాగస్వామ్యానికి ఆధారాలు కాదనలేనివి. దాని సైనిక, ఇంటర్- సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చాలాకాలంగా లష్కరే తోయిబాకి మద్దతు ఇస్తున్నాయి. ఈ వాస్తవాన్ని మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ 2019లో అంగీకరించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవల కాశ్మీర్ పాకిస్తాన్కు ‘జీవనాడి’ అని పిలిచారు, ఇది ఇస్లామాబాద్ ఉద్దేశాలను వెల్లడించింది. అయినప్పటికీ పాకిస్తాన్ తమ ప్రమేయాన్ని నిరాకరించి ‘తటస్థ’ దర్యాప్తును ప్రతిపాదిస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనను భారతదేశం తిరస్కరించింది.
భౌగోళిక రాజకీయ లెక్కలు
అమెరికా, యూరప్ ప్రతిస్పందనలు దౌత్యపరమైన అస్పష్టతతో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం స్వీయరరక్షణ దాడులను పాకిస్తాన్ ఉగ్రవాద స్పాన్సర్షిప్తో సమానం చేస్తూ ‘కాల్పుల విరమణ’ చేయాలని రెండు దేశాలను కోరారు . దోషిని, బాధితుణ్ణి ఒకే గాట కట్టి తీర్పులిస్తున్న అమెరికా అధ్యక్షుడిలో వ్యాపార ధోరణి తప్ప, ప్రపంచ తీవ్రవాదాన్ని అంతమొందించాలనే లక్ష్యం ఏ కోశానా కనిపించలేదు. పాకిస్తాన్ ఖనిజ సంపదలో అమెరికా ప్రయోజనాలకు, చైనా, రష్యాకు ప్రతిగా యూఎస్ పాత్రకు అధిక ప్రాధా న్యత ఇచ్చారు. యూరప్ ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ అస్పష్టమైన ఖండనలు జారీ చేశాయి. అయితే, భారతదేశం చర్యలను ఆమోదించకుండా తప్పించుకున్నాయి. ఆయుధ ఒప్పందాలకు అంతరాయం కలిగించే విషయంలో జాగ్రత్తగా ఉన్న యూకే ..పాకిస్తాన్పై విమర్శలను పక్కన పెట్టింది, ఫ్రాన్స్, జర్మనీ.. వాణిజ్యం, ఆఫ్గాన్ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇచ్చాయి. భారతదేశానికి మద్దతు ఇవ్వడంలో పశ్చిమ దేశాలు విముఖత ఒక కలతపెట్టే వాస్తవాన్ని బహిర్గతం చేస్తోంది. భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు.. న్యాయాన్ని తుడిచిపెడుతున్నాయి. పాకిస్తాన్ ఆర్థిక దౌత్యం, పరోక్ష హింస అనే ద్వంద్వ వ్యూహం అదుపు లేకుండా కొనసాగుతోంది. నేను గమనించినట్టు ‘భారతదేశం ఒంటరిగా ఉగ్రవాదంతో పోరాడుతోంది’, అయితే, అమెరికా, యూరప్ దేశాలు వారి లాభం కోసం డబుల్ గేమ్ ఆడుతున్నాయి.
పాక్ తప్పుడు కథనాలు
పాకిస్తాన్ మాజీ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. అమెరికాకు మిత్రదేశంగా ఉంటూ పాకిస్తాన్ దశాబ్దాలుగా ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చినట్టు అంగీకరించారు. ఐఎస్ఐ, ఎల్ఇటి, జైష్- ఎ- మొహమ్మద్కు మద్దతు ఇస్తున్నట్లు చాలా ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ, పహల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్ తమ సంబంధాలను తిరస్కరించింది. అది భారతదేశ ‘ఫాల్స్ ఫ్లాగ్’ అని అసంబద్ధంగా పేర్కొంది. పాకిస్తాన్ ద్వంద్వ చరిత్ర స్పష్టంగా ఉంది. 9/11 తర్వాత జరిగిన మాన్హంట్ సమయంలో ఒసామా బిన్ లాడెన్కు అబోటాబాద్లో ఆశ్రయం కల్పించింది. అయినప్పటికీ, అమెరికా పాకిస్తాన్కు సహాయం కొనసాగించింది. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని పాకిస్తాన్తో సమానం చేసేలా వ్యవహరిస్తున్న పశ్చిమ దేశాల ధోరణి గర్హనీయం. ఇద్దరు ప్రధాన మంత్రులకు క్లోజ్గా ఉన్నామనే ట్రంప్ వాదన భారత్ సంయమనాన్ని, పాకిస్తాన్ ఉగ్రవాద సహకారాన్ని విస్మరిస్తుంది. ఉగ్రవాద సంబంధాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ను నాటోయేతర ప్రధాన మిత్రదేశంగా అమెరికా పేర్కొనడం శోచనీయం. 9/11, యూకే అండర్గ్రౌండ్ బాంబు దాడులు, 2015 పారిస్ దాడులు పహల్గాం వంటి దాడుల బాధితులను అమెరికా అవమానిస్తోంది. భారత్, పాకిస్తాన్లను సమానంగా చూడటం ద్వారా పశ్చిమ దేశాలు పాకి
స్తాన్ అసత్య కథనాన్ని చట్టబద్ధం చేశాయి.
సెలెక్టివ్ పాలిటిక్స్
పశ్చిమ దేశాల సెలెక్టివ్ పాలిటిక్స్ ఉగ్రవాదంపై ప్రపంచ పోరాటానికి ద్రోహం చేస్తున్నాయి. భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి వెనకాడడం ద్వారా అమెరికా, యూరప్.. పాకిస్తాన్ ప్రాక్సీ యుద్ధాలకు పరోక్షంగా సహకరిస్తున్నాయి. 2008 ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకురావడంలో అమెరికా విఫలమైంది. ఈ పరిణామం టీఆర్ఎఫ్ వంటి ఉగ్రవాద సంస్థల ఆవిర్భావానికి దోహదపడింది. పాకిస్తాన్కు కొనసాగుతున్న పాశ్చాత్యదేశాల సహాయం, ఆయుధాల అందజేత ద్వారా ఆయా దేశాలు ఒక తీవ్రమైన సందేశాన్ని పంపుతున్నాయి. ఉగ్రవాదం భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడితే సహించదగినదిగా ఈ సందేశం తెలుపుతోంది. ఉగ్రవాదాన్ని ఓడించడానికి దౌత్యపరమైన రక్షణ కాదు, స్పాన్సర్లపై ఏకీకృత వైఖరి అవసరం. పాకిస్తాన్ను జవాబుదారీగా ఉంచడంలో పశ్చిమ దేశాలు విముఖత చూపడం వల్ల ఉగ్రవాదాన్ని స్టేట్ పాలసీగా సాధారణీకరించే ప్రమాదం ఉంది. నేను నమ్ముతున్నట్టుగా ‘పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధాలపై పశ్చిమ దేశాలు మౌనం వహించడం తదుపరి దాడికి పాక్కు నిధులు సమకూర్చినట్లే’.
తీవ్రవాదంపై భారత్ యుద్ధం ఆగదు
పహల్గాం టెర్రర్ అటాక్ ఉగ్రవాద క్రూరత్వాన్ని గుర్తు చేస్తుంటే, ఆపరేషన్ సిందూర్ భారత దేశం ధైర్యవంతమైన వైఖరిని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ ఖనిజాలు, పొత్తుల ద్వారా నడిచే పశ్చిమ దేశాల నిశ్శబ్ద ప్రతిస్పందన న్యాయాన్ని త్యాగం చేస్తుంది. భారతదేశాన్ని పాకిస్తాన్తో సమానం చేయడం ద్వారా పశ్చిమ దేశాలు ఉగ్రవాదంపై జరుగుతున్న యుద్ధాన్ని మోసం చేస్తున్నాయి. పాకిస్తాన్ సహకారాన్ని భారతదేశం బహిర్గతం చేయడం, దౌత్యాన్ని ఉపయోగించడం, ఆత్మరక్షణలో భాగంగా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం కొనసాగించాలి. అంతర్జాతీయ సమాజం వ్యూహాత్మక ద్వంద్వ వైఖరితో సంబంధం లేకుండా భారత్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి. పహల్గాం బాధితుల రక్తం న్యాయం జరగాలని కోరుతోంది.
కృష్ణసాగర్ రావు,
బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి,
నేషన్ బిల్డింగ్ ఫౌండేషన్ ఛైర్మన్