న్యూఢిల్లీ: నగరాల్లో ఫోర్ వీలర్ డీజిల్ వెహికల్స్ ను నిషేధించాలంటూ సిఫార్సు చేసిన ఎక్స్పర్టుల కమిటీ నివేదికను ప్రభుత్వం ఇంకా ఆమోదించ లేదని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎన్జీ) వివరణ ఇచ్చింది. ఎనర్జీ ట్రాన్సిషన్ అడ్వైజరీ కమిటీ (ఈటీఏసీ) అందజేసిన రిపోర్ట్ తమకు చేరిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అభిప్రాయం చెప్పలేదని ఒక ట్వీట్లో పేర్కొంది. నగరాల్లో 2027 నాటికి డీజిల్తో నడిచే ఫోర్–వీలర్ వెహికల్స్ వినియోగాన్ని నిషేధించాలని ఎక్స్పర్టుల ప్యానెల్ సిఫార్సు చేసింది. ‘‘నగరాల్లో పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలో విషవాయువులను తగ్గించడానికి ఎలక్ట్రిసిటీ, గ్యాస్ ఇంధనంతో నడిచే వెహికల్స్కు మారాలి. 2030 నాటికి సిటీల్లో డీజిల్ బస్సులను అనుమతించకూడదు.
2024 నుండి నగరాలలో సరకుల రవాణా కోసం డీజిల్ బస్సులను వాడకూడదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగాన్ని పెంచేందుకు ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ స్కీమ్ (ఫేమ్) కింద ఇచ్చిన ప్రోత్సాహకాలను ఇక ముందు కూడా పొడిగించాలి. బ్యాటరీతో నడిచే సిటీ డెలివరీ వెహికల్స్కు మాత్రమే 2024 నుంచి రిజిస్ట్రేషన్లను అనుమతించాలి. వస్తువుల రవాణా కోసం రైల్వేలను, గ్యాస్తో నడిచే ట్రక్కులను ఎక్కువగా ఉపయోగించాలి. సుదూర బస్సులను భవిష్యత్లో బ్యాటరీలతో నడిచేలా చేయాల్సి ఉంటుంది. రాబోయే 10–15 సంవత్సరాల్లో గ్యాస్ వాడకాన్ని విపరీతంగా పెంచాలి” అని కమిటీ సూచించింది. చమురు శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ నాయకత్వంలోని ఎనర్జీ ట్రాన్సిషన్అడ్వైజరీ కమిటీ ఈ సిఫార్సులను చేసింది.
