తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల ప్రజా ఉద్యమానికి లభించిన చారిత్రక ఫలితం. అలాంటి వాస్తవంపై ఇంకా సందేహాలు రేకెత్తించడంకన్నా, ఆ ఉద్యమం సాధించిన లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే సముచితం. ప్రజాకాంక్షకు ప్రతిరూపంగా, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రాష్ట్రంపై వివాదాల కంటే, దాని భవిష్యత్ నిర్మాణంపై చర్చలు జరగడం సమాజానికి మరింత ప్రయోజనకరం. ఎన్నికల్లో గెలవడం నాయకత్వానికి ఆరంభం మాత్రమే, కానీ అంతిమ గమ్యం కాదు. మోదీకి జాతీయ స్థాయిలో, పవన్ కల్యాణ్కు ఏపీలో లభించిన ప్రజా మద్దతు ఎంత గొప్పదైనా, ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపలేకపోతే ఆ మద్దతు కనుమరుగు కాక తప్పదు. మోదీకి దేశం, పవన్ కల్యాణ్కు ఏపీ రాష్ట్రం ఇచ్చిన బాధ్యతల్ని నిలబెట్టుకుంటున్నరా? వారి రాజకీయ విజయాన్ని పాలనా విజయంగా మార్చగలిగారా? ఆ బాధ్యతలపై చర్చ జరగాలి.
పల్లె నుంచి పార్లమెంట్ దాకా అనేక పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు, పార్టీల ఐక్యత, నిపుణుల కమిటీల అభిప్రాయాలతో, ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు పన్నెండేళ్లు పూర్తైంది. తెలంగాణ తన రాజకీయ, ఆర్థిక, పరిపాలనా ప్రయాణంలో ముందుకు సాగుతోంది. అయినప్పటికీ రాష్ట్ర విభజన అంశం మాత్రం తరచూ రాజకీయ చర్చల కేంద్రంగా మారుతోంది. ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అప్పట్లో చంద్రబాబు సహా మరికొందరు బీజేపీ నాయకులు ‘తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు.. కానీ విభజన జరిగిన తీరు తప్పు’ అనే వ్యాఖ్యలు చేయడం మరోసారి పాత గాయాలను తడిమే ప్రయత్నంగా కనిపిస్తోంది. మా ప్రశ్నలు ఏమిటంటే.. తెలంగాణ ఏర్పాటును సమర్థించినవారే నేడు విభజన తీరును ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ ఆంతర్యం ఏమిటి? విభజన తీరు తప్పంటున్నారు కదా.. మరి ఎలా రాష్ట్రాన్ని విభజించడం? అదే స్థానంలో బీజేపి ఉంటే విభజన సరిగ్గా జరిగేదా.. అసలు రాష్ట్రం వచ్చేదా? రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం గడుస్తున్నా ఈ రాజకీయ వైరుధ్యాలెందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ ఆవిర్భావం ఆకస్మిక నిర్ణయం కాదు
తెలంగాణ రాష్ట్రం రాజకీయ నిర్ణయంతో ఏర్పడలేదు. అది దశాబ్దాల చారిత్రక ఉద్యమం ఫలితం. ఉద్యోగాలు–నిధులు–నీళ్ల పంపిణీలో జరిగిన అన్యాయాలపై వ్యక్తమైన అసంతృప్తి, 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం, అనంతరం విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, రైతులు, మహిళలు పాల్గొన్న విస్తృత ప్రజా ఉద్యమం కలిసి తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాది వేశాయి. ఈ ప్రక్రియలో అప్పటి కేంద్ర ప్రభుత్వం అనేక స్థాయిల్లో సంప్రదింపులు నిర్వహించింది. ప్రణబ్ ముఖర్జీ కమిటీ రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించింది. శ్రీకృష్ణ కమిటీ వేలాది వినతిపత్రాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించింది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి చర్చించిన తర్వాతే రాష్ట్ర విభజన జరిగింది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంపీలు దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో కాంగ్రెస్ ఎంపీ పెప్పర్ స్ప్రే దాడులను తట్టుకుని సైతం తెలంగాణ బిల్లు ప్రకటనకు దారి సుగమం చేశారు. అందువల్ల ‘ఎటువంటి అధ్యయనం లేకుండా, సంప్రదింపులు లేకుండా తెలంగాణ ఏర్పడింది’ అనే వాదన
చారిత్రకంగా నిలబడదు.
బీజేపీ వైఖరిలో వైరుధ్యం
1998 నుంచే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు ప్రకటించిన పార్టీ బీజేపీ. జార్ఖండ్, చత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటుకు అదే పార్టీ నాయకత్వం వహించింది. కేంద్రంలో అధికారమిస్తే ఒక ఓటు.. రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం కూడా చేసింది. కానీ అప్పట్లో చంద్రబాబు ఒత్తిడి వల్ల కాకినాడ తీర్మానాన్ని అటకెక్కించింది. తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న టైంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ద్వంద్వనీతి పాటించింది. అనేక ఒత్తిళ్ల నడుమ 2014లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటులో బీజేపీ మద్దతు ఇచ్చింది. అప్పటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బహిరంగంగా సమర్థించారు. తెలంగాణ ప్రజలు ఆమెను ‘తెలంగాణ చిన్నమ్మ’గా గౌరవించారు. అయితే అదే పార్టీకి చెందిన నాయకులిప్పుడు ముఖ్యంగా పీఎం మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , కర్నాటక ఎంపీ తేజస్వీ సూర్య సహా తదితర నేతలంతా ‘విభజన సరైన విధంగా జరగలేదు’ అనే విషపు వ్యాఖ్యానాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చిన పార్టీ నేడు అదే ప్రక్రియను పరోక్షంగా ప్రశ్నించడం బీజేపీ ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోంది.
‘విభజన తీరు తప్పు’ అంటే ఏమిటి?
విభజన జరిగిన తీరు తప్పు అని చెప్పేవారు ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పడం లేదు. మరిన్ని కమిటీలు కావాలా? మరిన్ని చర్చలు జరగాలా? ప్రజాభిప్రాయ సేకరణ మళ్లీ నిర్వహించాలా? లేక తెలంగాణ ఏర్పాటే వాయిదాపడాలా? రాజకీయంగా ఈ వ్యాఖ్య ఆకర్షణీయంగా వినిపించవచ్చు. కానీ వాస్తవంగా చూస్తే అది అస్పష్టమైన వాదన. విభజన తర్వాత ఆస్తుల పంపిణీ, ఉద్యోగుల కేటాయింపు, విద్యుత్ సంస్థల విభజన, నీటి వివాదాలు వంటి సమస్యలు పరిష్కారమైనప్పుడు ఎట్లా తప్పుపడుతారు? భారతదేశంలో జరిగిన ప్రతి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో ఇలాంటి సమస్యలు వచ్చాయి. అందువల్ల అమలులో సమస్యలు ఉండటం వల్ల మొత్తం తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టడం సరైన విశ్లేషణ కాదు.
రాజకీయ అవసరాల కోసమేనా?
పన్నెండేళ్ల తర్వాత ఈ అంశం మళ్లీ ఎందుకు తెరపైకి వస్తోంది అనే ప్రశ్నకు సమాధానం రాజకీయాల్లోనే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో విభజన అనంతర నష్టాల భావన ఇప్పటికీ రాజకీయ చర్చల్లో ఉంది. ప్రత్యేక హోదా అమలు కాకపోవడం, రాజధాని నిర్మాణ వివాదాలు, పెట్టుబడుల పంపిణీ వంటి అంశాలు అక్కడ భావోద్వేగ రాజకీయాలకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘విభజనలో అన్యాయం జరిగింది’ అనే వాదన కొంతమంది నాయకులకు రాజకీయంగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో తెలంగాణలో రాజకీయ విస్తరణ లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, ఒకవైపు తెలంగాణకు మద్దతు తెలిపిన పార్టీగా కనిపించాలని, మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని భావోద్వేగాలను కూడా కోల్పోవద్దనే ద్వంద్వ రాజకీయ సమీకరణంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘విభజన తీరుకు వ్యతిరేకం’ అనే మధ్యంతర రాజకీయ భాష్యం వినిపిస్తోంది.
ఇప్పుడు అవసరం ఏమిటి?
తెలంగాణ రాష్ట్రం అనేది ప్రజాస్వామ్య పోరాటానికి లభించిన రాజ్యాంగబద్ధ గుర్తింపు. ‘విభజన తీరు’ అనే పాత చర్చను మళ్లీ మళ్లీ ముందుకు తేవడం రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడవచ్చు. ప్రజాస్వామ్య ఉద్యమం, రాజ్యాంగబద్ధ ప్రక్రియ, పార్లమెంటు ఆమోదం కలిసి రాష్ట్రాన్ని ఆవిర్భవింపజేశాయి. ప్రస్తుత రాజకీయ అవసరాల కోసం కాకుండా.. కృష్ణా–గోదావరి జలాల పంపిణీ, ఉమ్మడి ఆస్తుల వివాదాలు, రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక సహకారం, ప్రాంతీయ అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. ఇప్పుడు ప్రజలు ఎదురుచూస్తున్నది గతాన్ని తిరిగి విచారించే రాజకీయాలు కాదు. భవిష్యత్తును నిర్మించే పాలన. తెలంగాణ గాయాన్ని మళ్లీ కెలకడం ద్వారా ఎవరికీ లాభం లేదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహకారం పెంచడం ద్వారా కోట్లాది ప్రజలకు ప్రయోజనం ఉంటుంది.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి?
తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గతంలో నిరాహార దీక్షలు చేసిన నాయకుడిగా పవన్ కల్యాణ్కు ప్రత్యేక రాజకీయ చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోణంలో ఆయనకు అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ, ఆ విమర్శలు చారిత్రక వాస్తవాలను విస్మరించకూడదు. ఉద్యమాలు, అమరుల త్యాగాలు, రాజకీయ ఏకాభిప్రాయాలు, పార్లమెంటు నిర్ణయాలు అన్నింటినీ పక్కనబెట్టి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని కేవలం ఒక పరిపాలనా పొరపాటుగా చిత్రీకరించడంలో కపటనీతి తప్ప ఏముంది? అందుకే తెలంగాణ సమాజంలో ఈ వ్యాఖ్యలు అసహజ ప్రతిస్పందనలకు కారణమవుతున్నాయి.
వాస్తవానికి పార్లమెంటులో ఏ బిల్లు పై ఓటింగ్ జరిగినా, లేదా మూజువాణి ఓటుతో జరిగినా తలుపులు మూసే చేస్తారు. ఆ అవగాహన లేకుండా.. కొందరు పార్లమెంటు తలుపులు మూసి బిల్లు పాస్ చేశారనే అసంబద్ధ వాదన చేస్తున్నారు. విభజనపై ఇలాంటి ఆరోపణలు చేసేవారి వంకర బుద్ధి ఏమిటో ఎవరికైనా అర్థమవుతున్నదే.
వెంకట్ గుంటిపల్లి
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం
