ఆధ్యాత్మికం : బుద్ధి అంటే ఏంటీ.. బుద్ధి లేకపోతే వచ్చే నష్టాలు ఏంటీ.. యోగస్థితి లేకపోతే బుద్ధి ఉండదా..?

ఆధ్యాత్మికం : బుద్ధి అంటే ఏంటీ.. బుద్ధి లేకపోతే వచ్చే నష్టాలు ఏంటీ.. యోగస్థితి లేకపోతే బుద్ధి ఉండదా..?

కర్మాచరణం.. బుద్ధి యోగంతో చెయ్యమని కదా చెప్పింది. ఆ బుద్ధి అన్ని సమయాల్లో సరిగ్గా పని చేయకపోవటానికి కారణం ఏమిటి? ఇష్టపడి కానీ, అయిష్టంతో కాని ఇంద్రియాలతో వ్యవహరించినట్టయితే మానవుడు ఇంద్రియాలలోనే నివసించటం జరుగుతుంది. ఏదైనా కావాలనే అభిలాషతోనైనా నిరంతరం తలుచుకుంటూ ఉండవచ్చు. కోరికని జయించాలనే భావంతో దానినే అనుక్షణం తలచుకుంటూ ఉండవచ్చు.రెండు సందర్భాలలోనూ ఇంద్రియాలకి లక్ష్యాలైన వాటిని తలచుకుంటూ ఉండటం వల్ల వాటితో సంబంధం ఏర్పడుతుంది. 

సంబంధం వల్ల కోరిక కలుగుతుంది. తెలియని వస్తువు కావాలనిపించదు కదా. ముందుగా ఇష్టం లేని వస్తువు మీద కోరిక కలుగుతుంది. దీనినే వైరభక్తి అనవచ్చునేమో. దీనికి ఉదాహరణగా ప్రస్తుత కాలంలో చాలామందికి ఉన్న చాలా అలవాట్లని (మద్యం, పొగాకు, గంజాయి మొదలైనవి) చెప్పవచ్చు. ఇవి కావాలని ఎవరూ. అనుకోరు. 

మొదటిమారు రుచి చూసినప్పుడు నచ్చకపోయినా, వాటి సాన్నిహిత్యం వాటికి అలవాటు పడేట్టు చేస్తుంది. అంటే ఇష్టం వల్ల మాత్రమే కాదు, తీవ్రమైన అయిష్టం వల్ల కూడా సంగం కలుగుతుంది. సంగం వల్ల కోరిక కలుగుతుంది. 

కోరిక క్రోధానికి దారి తీస్తుంది. ఎట్లాగంటే. అనుకున్న కోరిక తీరకపోయినా, తీరటానికి అవరోధాలు కలిగినా వచ్చేది కోపమే కదా. ఆ కోపం నిలబడిపోతే అది క్రోధం అవుతుంది. కామము.. క్రోధము జంటగా ఉంటాయి. క్రోధం ఉన్నప్పుడు. తెలివికి పొర కమ్ముతుంది. దీనివల్ల అంతకుముందు. తెలిసిన విషయాలు కూడా గుర్తు రావు. మామూలుగా కూడా కోపంలో ఒకదానికి బదులు మరొకటి చేయటం, అసలు విషయం గుర్తురావటం లేదని బాధపడుతూ ఉండటం గమనించవచ్చు. తెలిసిన మంచి విషయాలే మరపుకి రావటంతో బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే సమస్తం నాశనమైనట్టే కదా..!

బుద్ధి నశించకుండా దానితో కలిసి ఉండటం (బుద్ధి యోగం) వల్ల రాగద్వేషాలు తొలగిపోతాయి. అంటే తీవ్రమైన ఇష్టం కానీ, అయిష్టం కాని ఉండవు. ఇంద్రియాలు ఇంద్రియార్గాలలో వర్తిస్తున్నా ఇంద్రియాలు తన ఆధీనంలోనే ఉంటాయి. సమర్థుడైన యజమాని ఆధీనంలో ఉన్న సేవకులలాగా ఇంద్రియాలు వర్తిస్తూ ఉంటాయి. యజమాని మంచి వాడైనప్పుడు సేవకులు 

బలవంతంగా కాక ప్రేమతో, ఇష్టంగా పనిచేస్తారు.. అప్పుడు సేవకులు తాము చేసే పనిని సంతోషంగా చేస్తారు. వారికి కూడా ఆనందం లభిస్తుంది - జీత భత్యాలతో పాటు. అదేవిధంగా ఇంద్రియాలు తన అధీనంలో ఉన్నప్పుడు కన్ను తనకి నచ్చిన రూపంలో. వర్తిస్తున్నా, చెవి తనకి ఇష్టమైన శబ్దమునందు వర్తిస్తున్నా, నాలుక కోరిన రుచియందు వర్తిస్తున్నా, ముక్కు తనను ఆకర్షించిన వాసనను ఆస్వాదిస్తున్నా, శరీరం స్పర్శను ఆనందిస్తున్నా అవి తన ఆధీనంలో ఉంటాయి. వాటిని నిరోధించే ప్రయత్నం చేస్తే ఎదిరించటానికి సిద్ధం అవుతాయి. 

వాటిపై నిఘా ఉంచి వాటి పనిని వాటిని చేసుకోనిస్తే మంచిది. కాస్త అలుసు ఇస్తే మాత్రం నెత్తికెక్కి పెత్తనం చేస్తాయి. బానిసని చేసుకుంటాయి. అంటే అతిగా ఇష్టపడ్డా, కోప్పడ్డా సంగమే కదా. ఇంద్రియాలు తన ఆధీనంలో ఉంటే అభిముఖ్యం కాని, వైముఖ్యం కాని తన చేతిలోనే ఉంటాయి కాని ఇంద్రియాలకి ఉండని స్థితి వస్తుంది. అంటే ఇంద్రియాల మీది పెత్తనం మనసు చేతిలో నుండి బుద్ధి చేతికి అప్పచెప్పటం జరుగుతుంది. అప్పుడు మనిషి తన పట్ల విధేయత ఉన్న తనలోని భాగాలు ఉన్నవాడు అవుతాడు. దీని వల్ల జీవుడు ప్రసన్నంగా ఉంటాడు. 

కదలని నీటిలో ఆకాశం, సూర్యుడు, చంద్రబింబం, నక్షత్రాలు మొదలైన శాశ్వత తత్వాలు యథాతథంగా ప్రతిబింబించినట్టురాగద్వేషాదుల చేత, ఇతరుల గురించి, వస్తువుల గురించి, అభిప్రాయాల చేత కలుషితం కాని మనసులో ఎదుటివారి యందున్న దైవీతత్వం ప్రతిబింబిస్తుంది. అదే ప్రసన్నమైన మనసు. దీనివల్ల దుఃఖానికి కారణాలైనవి అన్నీ పోతాయి. దుఃఖం పోతే మిగిలేది బుద్ధి. అదే తానై ఉండటం. 

యోగస్థితి లేక పోతే బుద్ధి ఉండదు. బుద్ధి మనసుగా, ఇంద్రియాలుగా చెల్లా చెదురైపోతూ ఉంటుంది. చెదిరిన స్థితిలో, దానిలో ప్రతిబింబించే భగవత్తత్త్వం కూడా సమగ్రంగా ఉండదు. అలలున్న కోనేటిలో సూర్యుడి ప్రతిబింబంలాగా ముక్కలు ముక్కలుగా కనపడుతుంది. భగవన్మయమైన ప్రకృతి లేక వాతావరణం కల్లోలంగా ఉన్న మనసు మీద ప్రతిబింబించితే భగవంతుడుగా కాక వస్తువులుగా, కోరికలుగా, బంధుత్వాలుగా, శతృత్వాలుగా, సుఖ దుఃఖాలుగా కనపడుతుంది. కనుక దైవభావన ఉండదు. 
ఇంక శాంతి ఎట్లా ఉంటుంది? శాంతి లేని వాడికి సౌఖ్యం ఉండదు కదా.. 

దీనికి మంచి పోలిక చెపుతాడు శ్రీకృష్ణుడు. బాగా అర్థమై వంటపట్టటానికి, ఉప్పెన వచ్చినప్పుడు గాలి వాలుకి వెడుతున్న కెరటాలు ఎటు తీసుకెళ్తే నావ అటు వెళ్ళినట్టు.. ఇంద్రియాలు అనే అలల చేత కదపబడుతున్న ప్రజ్ఞ కూడా అవి తీసుకువెళ్ళిన తీరానికే చేరుతుంది. కానీ గమ్యం అది కాదు కదా. అనుకున్న గమ్యం చేరటానిక్ ప్రజ్ఞని బుద్ధితో యోగం చెయ్యాలి. యోగం అంటే కలయిక అని కదా అర్థం. అంటే ప్రజ్ఞని బుద్ధితో చేర్చాలి. ఇదే గొప్ప నేర్పు. ఈ నేర్పు లేకపోతే లక్ష్యం చేరలేము. అందుకే 'బుద్ధి నాశాత్ ప్రణశ్యతి' అని నశించకుండా ఉండే మార్గం తెలియజేశాడు జగద్గురువు శ్రీకృష్ణుడు..

-– వెలుగు,లైఫ్​–