మహిళల్లో ఫైనాన్షియల్ నాలెడ్జ్ తక్కువ
హోం క్రెడిట్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: వ్యక్తులకు అప్పులిచ్చేటప్పుడు బ్యాంకులేం చూస్తాయో తెలుసా? అతని సిబిల్ స్కోర్ ఎంత అని ముందు ఆరా తీస్తాయి. మరీ మీకు సిబిల్ అంటే ఐడియా ఉందా? దేశంలో తీసుకున్నోళ్లలో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి తమ సిబిల్ స్కోర్ ఎంతో తెలియదని ఓ సర్వేలో వెల్లడైంది. దేశంలో ప్రజలకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ తక్కువగా ఉందని ఈ సర్వేలో తెలిసింది. హోమ్ క్రెడిట్ ఇండియా జరిపిన ఈ సర్వేలో మొత్తం వెయ్యి మంది బారోవర్లు పాల్గొన్నారు. వీరిలో కేవలం 52 శాతం మందికి మాత్రమే సిబిల్ స్కోర్ గురించి, దాని ప్రాముఖ్యం గురించి తెలుసని ఈ సర్వే పేర్కొంది.
అయినప్పటికీ వీరిలో 68 శాతం మందికి వారి సిబిల్ స్కోర్ గురించి తెలియదని తెలిపింది. లోన్లు తీసుకున్నప్పటికీ వీరికి తమ సిబిల్ స్కోర్ తెలియదని పేర్కొంది. పాట్నాలో 22 శాతం మందికి మాత్రమే తమ సిబిల్ స్కోర్ గురించి తెలుసని, దేశంలో సిబిల్ స్కోర్పై అవేర్నెస్ ఈ సిటీలోనే తక్కువగా ఉందని ఈ స్డడీలో వెల్లడైంది. ఈ సిటీ తర్వాత కోల్కతా, ముంబై సిటీలున్నాయి. మొత్తం ఏడు సిటీలలో ఈ సర్వేను హోం క్రెడిట్ జరిపింది. ఈ సర్వేలో పాల్గొన్న బారోవర్లలో 76 శాతం మందికి తమ లోన్లపై ఎంత వడ్డీ పడుతోందో తెలియదని ఈ సర్వే పేర్కొంది.
వీరు కేవలం నెలకు ఎంత ఈఎంఐ కట్టాలో వంటి విషయాలపై ఆసక్తి చూపించారని, కానీ సపరేట్గా వడ్డీ ఎంత పడుతోందో వీరికి తెలియదని పేర్కొంది. ఢిల్లీలో 17 శాతం, జైపూర్లో 19 శాతం, ముంబైలో 24 శాతం మంది బారోవర్లకు మాత్రమే తమ లోన్లపై వడ్డీ ఎంతో తెలుసని ఈ సర్వే తెలిపింది. ‘ఏ ఎకానమీకైనా ఆర్థిక పరమైన అక్షరాస్యత ముఖ్యం. తమ కస్టమర్లకు ఆర్థిక పరమైన నాలెడ్జ్ ఎంతుందో తెలుసుకోవడానికి ఈ సర్వేను నిర్వహించాం’ అని హోం క్రెడిట్ ఇండియా సీఈఓ మార్కో కార్విక్ అన్నారు. ఆర్థిక పరమైన నాలెడ్జ్ను పెంచుకోవడానికి క్లాస్లు తీసుకుంటామని చాలా మంది చెప్పారని అన్నారు.
సర్వేలో పాల్గొన్నవారిలో 50 శాతం మందికి మ్యూచువల్ ఫండ్స్పై అవగాహన ఉందని ఈ సర్వేలో తేలింది. 95 శాతం మందికి తమ బ్యాంక్ పాస్బుక్, బేసిక్స్పై అవగాహన ఉందని తెలిసింది. 87 శాతం మంది రెస్పాండెంట్లకు సేవింగ్స్ అకౌంట్స్ గురించి ఐడియా ఉందని, 80 శాతం మంది రెస్పాండెంట్లకు కరెంట్ అకౌంట్పై అవగాహన ఉందని ఈ సర్వేలో వెల్లడైంది. మగవాళ్లతో పోలిస్తే మహిళలలో ఫైనాన్షియల్ నాలెడ్జ్ తక్కువగా ఉందని తెలిపింది.