
సిద్దిపేట(చిన్నకోడూరు), వెలుగు: వృద్ధురాలు చనిపోగా.. ఆస్తి పంపకాల కోసం కుటుంబ సభ్యులు అంత్యక్రియలను నిలిపివేశారు. అనంతరం మరుసటి రోజు దహన సంస్కారాలు చేశారు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు వంగ కిష్టవ్వ(90) అనారోగ్యంతో ఆదివారం మధ్యాహ్నం చనిపోయింది. ఆమెకు ముగ్గురు కొడుకులు నారాయణ, రాజేశం, రామ్ శంకర్, కూతురు కళావతి ఉన్నారు. వీరిలో నారాయణ, రామ్ శంకర్ కొన్నేండ్ల కింద చనిపోయారు. అయితే.. రూ. 30 లక్షల విలువైన ఇంటిని కొంతకాలం కింద రెండో కొడుకు రాజేశం తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.
తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని మిగతా ఇద్దరు కొడుకుల పిల్లలు పెద్ద మనుషుల్లో పెట్టగా దీనిపై ఇప్పటికీ పంచాయితీ నడుస్తోంది. కాగా.. ఇంటిని మూడు వాటాలుగా పంచిన తర్వాతే కిష్టవ్వ అంత్యక్రియలు చేయాలని పట్టుపట్టి అడ్డుకున్నారు. దీంతో కుల సంఘం నేతలు జోక్యం చేసుకుని ఇరువర్గాలతో మాట్లాడి.. ఆస్తిని పంచుకునేందుకు ఒప్పుకుని అడ్వకేట్ వద్ద నోటరీ చేయించారు. ఇదంతా పూర్తయ్యేందుకు ఒకరోజు పట్టింది . దీంతో కిష్టవ్వ అంత్యక్రియలు సోమవారం పూర్తి చేశారు.