- రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్
- ‘దిశ’ ఎన్కౌంటర్పై విచారణ
హైదరాబాద్, వెలుగు : ‘దిశ’ కేసు నిందితుల ఎన్కౌంటర్పై దాఖలైన పిటిషన్లు విచారణకు వచ్చినప్పుడల్లా రాష్ట్ర సర్కార్ వాయిదాలు కోరడంపై హైకోర్టు ఫైర్ అయ్యింది. కేసును కావాలనే పదేపదే వాయిదాలు కోరుతూ తప్పించుకుంటున్నట్లుగా కనిపిస్తోందని సీరియస్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ తరఫు లాయర్ బిజీగా ఉన్నారని చెప్పడం సరికాదని మండిపడింది. కేసులను వాదించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఉండగా.. ఢిల్లీ నుంచి మరో లాయర్ ఎందుకని ప్రశ్నించింది. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పిన కోర్టు.. విచారణను ఏప్రిల్ 12కు వాయిదా వేసింది.
2019లో జరిగిన ‘దిశ’ కేసు నిందితుల ఎన్కౌంటర్ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీల డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. రాష్ట్ర సర్కార్ తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. కేసుపై వాదనలు వినిపించడానికి సుప్రీంకోర్టు నుంచి సీనియర్ లాయర్ హాజరుకానున్నారని కోర్టుకు తెలిపారు. ఆయన బిజీగా ఉండటంతో విచారణను వాయిదా వేయాలని కోరారు. అయితే అడ్వకేట్ జనరల్పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.కేసు విచారణను ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేశామని..మళ్లీ సమయం కోరడం సరికాదని అసహనం వ్యక్తం చేసింది. చివరి అవకాశంగా విచారణను వచ్చే నెల 12కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.