ఎంపీ సంతోష్​ ఎక్కడ? ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ వెంట కనిపిస్తలే..

ఎంపీ సంతోష్​ ఎక్కడ? ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ వెంట కనిపిస్తలే..

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాలను చుట్టేస్తున్నా, ఆయన వెంట ఎప్పుడూ ఉండే ఎంపీ సంతోష్​కుమార్​ ఎక్కడా కనిపించడం లేదు. గతంలో కేసీఆర్​ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట సంతోష్​ తప్పనిసరిగా ఉండేవారు. ఢిల్లీకి వెళ్లినా ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లినా.. జిల్లాల టూర్​కు వెళ్లినా కేసీఆర్​తో పాటే ఉండేవారు. కానీ కొన్నాళ్లుగా ఆయన ఎవరికీ కనిపించడం లేదు.

సీఎం కేసీఆర్​ కుటుంబంలో తలెత్తిన విభేదాలతో ఆయన కొన్ని రోజులకు ప్రగతి భవన్​కు దూరంగా ఉన్నారని గతంలో ప్రచారం జరిగింది. తర్వాత ఆయన మళ్లీ ప్రగతి భవన్​లో ప్రత్యక్షమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంతోశ్ ​ప్రమేయం అంతగా లేదనే ప్రచారం జరుగుతోంది. బేగంపేట క్యాంప్​ ఆఫీస్​ కేంద్రంగా నిర్వహిస్తున్న వార్​ రూమ్​లలోనూ ఆయన పాత్ర లేదని తెలుస్తోంది. అసలు సంతోష్​ కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటీ అనేదానిపై బీఆర్ఎస్​నేతల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.