ఆ మూడు రాష్ట్రాల్లో సీఎంలు ఎవరు?

ఆ మూడు రాష్ట్రాల్లో సీఎంలు ఎవరు?
  • వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ, అమిత్​ షా
  • 2024 లోక్ సభ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్

హైదరాబాద్, వెలుగు : ఇటీవల ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది.  తెలంగాణలో కాంగ్రెస్, మిజోరంలో జెడ్పీఎం గెలుపొందాయి.  తెలంగాణ సీఎంగా  రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ కన్ఫాం చేసింది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి బీజేపీ కైవసం చేసుకున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల సీఎం అభ్యర్థులపై పడింది. ఈ మూడు రాష్ట్రాల్లో సీఎం పదవిని సీనియర్లకు కట్టబెడతారా..? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా.. అనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నది.

కొత్త ఎమ్మె ల్యేల నిర్ణయమే కీలకం

రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్ రాష్ట్రాల్లో  సీఎంల ఎంపికకు ఆయా రాష్ట్రాల్లోని కొత్త ఎమ్మెల్యేల అభిప్రాయాలే కీలకం కానున్నాయి. వారి అభిప్రాయాలు సేకరించిన తర్వాత కొత్త సీఎంలను కన్ఫాం చేయాలని పార్టీ భావిస్తోంది. అంతేగాక 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎంలను ఎంపిక చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎలాంటి అడ్డంకి కలిగించని నాయకులనే మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులుగా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వివాదాలకు దూరంగా ఉన్న ముఖాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.

సీఎం రేసులో ఉన్నదెవరంటే..

మధ్యప్రదేశ్​లో శివరాజ్ సింగ్ చౌహాన్​ను పక్కకు పెట్టే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తున్నది. సీఎం రేసులో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర తోమర్​లతో పాటు కైలాశ్​ విజయ వర్గీయ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు, రాజస్థాన్​లో సీఎం పదవి కోసం బీజేపీలో పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. సీఎం క్యాండిడేట్​గా మాజీ సీఎం వసుంధర రాజే పేరు బలంగా వినిపిస్తున్నా.. కొత్త ముఖాలుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, బీజేపీ నేతలు దియాకుమారి, మహంత్ బాలక్ నాథ్​ల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నా యి. ఇక, చత్తీస్ గఢ్ లో మాజీ సీఎం రమణసింగ్ సీఎం రేసులో ఉన్న మొదటి వ్యక్తికాగా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ సావో, ధర్మలాల్ కౌశిక్, మాజీ ఐపీఎస్ ఓపీ చౌదరి కూడా సీఎం రేసులో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్ని కల సందర్భంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ అధిష్టానం.. కొత్త సీఎంలుగా ఎవరిని ఎంపిక చేయనుందనేది ఆసక్తికరంగా మారింది.